BJP: టీడీపీ అడుగు జాడల్లో: కర్నూలు డిక్లరేషన్ ఏమైంది కన్నా? బీజేపీకి సీమ, ఉత్తరాంధ్ర సెగ..!
కర్నూలు: అమరావతి ప్రాంతంలోనే రాష్ట్ర రాజధానిని కొనసాగించాలంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ కోర్ కమిటీ నాయకులు చేసిన తీర్మానం.. కాక పుట్టిస్తోంది. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ చేసిన తీర్మానాన్ని జనంలోకి ఎలా తీసుకెళ్లాలనే ఆందోళన వారిలో వ్యక్తమౌతోంది. కర్నూలు డిక్లరేషన్ గురించి ప్రజలు ప్రశ్నిస్తే.. తమ పరిస్థితేమిటంటూ తర్జనభర్జన పడుతున్నారు.
జెఎన్యూ విద్యార్థులకు అండగా తమిళ హీరో: వారితో కలిసి ఢిల్లీలో నిరసన దీక్షలో
అమరావతి కోసం తీర్మానం..
ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన అమరావతిలోనే రాజధానిని కొనసాగించాల్సి ఉంటుందంటూ బీజేపీ ఓ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. శనివారం గుంటూరులోని పార్టీ రాష్ట్రశాఖ కార్యాలయంలో కోర్ కమిటీ నాయకులు సమావేశం అయ్యారు. పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సారథ్యాన్ని వహించిన ఈ సమావేశంలో పలు అంశాల గురించి ప్రస్తావించారు. అనంతరం అమరావతిలోనే రాజధానిని కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలంటూ ఓ తీర్మానాన్ని ఆమోదించారు.
కర్నూలు డిక్లరేషన్ అటకెక్కినట్టేనా..?
అక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ..రాయలసీమకు చెందిన బీజేపీ నేతలు కర్నూలు డిక్లరేషన్ అంశాన్ని లేవనెత్తుతున్నారు. 2018 ఫిబ్రవరి 23వ తేదీన కర్నూలులో ప్రకటించిన `రాయలసీమ డిక్లరేషన్`పై పార్టీ అగ్ర నాయకులు నోరు మెదపకవ పోవడం అటు సీమ నేతలకు మింగుడు పడట్లేదు. గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మినారాయణ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదింపజేసుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్ సహా..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రాయలసీమకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ మాధవ్ స్వాగతించారు. వారు ఇప్పటికీ దీనికే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. కోర్ కమిటీ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని వారిద్దరు సహా ఈ రెండు ప్రాంతాలకు చెందిన కొందరు సీనియర్ నాయకులు తమ వైఖరిని స్పష్టం చేసినప్పటికీ.. కన్నా లక్ష్మీనారాయణ వాటిని పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు.
ఈ తీర్మానాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లగలం..
అమరావతిలోనే రాజధానిని కొనసాగింపజేయాలంటూ బీజేపీ కోర్ కమిటీ చేసిన తీర్మానంపై విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యతను పార్టీ అగ్ర నాయకత్వం.. ఆయా ప్రాంతాలు, జిల్లాల నేతల భుజాలపై ఉంచింది. రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో రాజధానులను వద్దనే విషయాన్ని తాము.. తమ సొంత ప్రజలకు ఎలా వివరించగలమనే ఆవేదన ఆయా ప్రాంతాల నేతల్లో వ్యక్తమౌతోంది. ఈ సందర్భంగా బీజేపీ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్లోని అంశాలను వారు గుర్తు చేస్తున్నారు.
కర్నూలు డిక్లరేషన్ ఏం చెబుతోంది?
వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు గానీ, అటు జీఎన్ రావు కమిటీ గానీ, ఇటు బోస్టన్ కమిటీ గానీ చేసిన సిఫారసులు దాదాపు.. బీజేపీ నాయకులు ఇదివరకు రూపొందించిన కర్నూలు డిక్లరేషన్లాగే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలి. వెంటనే ప్రకటన చేసి భూసేకరణ చేయాలి. అసెంబ్లీ భవనం నిర్మించి ప్రతి ఆరునెలలకి ఒకసారి కర్నాటక, మహారాష్ట్ర తరహా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. సెక్రటేరియట్ , తదితర కొన్ని శాఖల భవనాలు ఏర్పాటు చేయాలి. గవర్నర్ తాత్కాలిక విడిదికి నివాసం ఇక్కడ ఏర్పాటు చేయాలి. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ప్రస్తుతం ఏర్పాటు చేయబడుతున్న తాత్కాలిక హైకోర్టు సైతం రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి.. ఇందులోని పలు అంశాలు వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి దగ్గరగా ఉన్నాయి.