భూమా ఎఫెక్ట్:చంద్రబాబుకు షాక్, జగన్ పార్టీలోకి గంగుల
కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ టిడిపి ఇంచార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపిని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు.
కర్నూల్: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వలసలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు షాక్ తగలనుంది.వైఎస్ఆర్ సిపి నుండి టిడిపిలోకి వలసలను బాబు ప్రోత్సహిస్తున్నారు.అయితే టిడిపి నుండి వైఎస్ఆర్ సిపిలోకి నాయకులు చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. కర్నూల్ జిల్లాలో టిడిపికి షాక్ ఇచ్చేందుకు తెలుగుతమ్ముళ్ళు సన్నద్దమయ్యారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపిని వీడనున్నారు.తన అనుచరులతో కలిసి ఆయన వైఎస్ఆర్ సిపిలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో బుదవారం నాడు ఆయన సమావేశమయ్యారు.
కర్నూల్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంఏల్ఏలు టిడిపిలో చేరడంతో అప్పటికే టిడిపిలో ఉన్న నాయకులు అసంతృప్తితో ఉన్నారు. పాత, కొత్త నాయకుల మధ్య పొసగడం లేదు. ఈ మేరకు పార్టీ సమావేశాల్లో శిల్ప సోదరులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి నాయకులు శిల్ప సోదరులు అసంతృప్తితో ఉన్నారు.దీనికి తోడుగా ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి కూడ సైకిల్ దిగేందుకు సమాయాత్తమౌతున్నారు.ఈ మేరకు బుదవారం నాడు ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు గంగుల ప్రభాకర్ రెడ్డి.గంగుల ప్రభాకర్ రెడ్డి, భూమా నాగిరెడ్డి కుటుంబాల మధ్య చాలా కాలం నుండి ఆధిపత్య పోరు ఉంది.
ఈ ఆధిపత్య పోరులో అనేక హత్యలు కూడ ఈ నియోజకవర్గంలో చోటుచేసుకొన్నాయి. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి గంగుల సోదరులు టిడిపిలో చేరారు. అయితే ఆ సమయంలో భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి విజయం సాధించారు.అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. ఆయన కూతురు అఖిల ప్రియ కూడ టిడిపిలో చేరారు. ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానం నుండి అఖిలప్రియ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఈ నెల 12వ, తేదిన నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 15 లేదా 18వ, తేదిన జగన్ సమక్షంలో గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపిని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.2009 వరకు భూమా నాగిరెడ్డి టిడిపిలో ఉండేవారు.సినీ నటుడు చిరంజీవి ఏర్పాటుచేసిన ప్రజా రాజ్యం పార్టీలో భూమా నాగిరెడ్డి చేరారు.
ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత భూమానాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2016 లో భూమా నాగిరెడ్డి ఆయన కూతురు అఖిలప్రియలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు.భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడాన్ని గంగుల ప్రభాకర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు.అయితే భూమా నాగిరెడ్డి పార్టీలో చేరిన నాటి నుండి తన వర్గానికి ప్రాధాన్యతను తగ్గించారని ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
తన అసంతృప్తిని అధినేత చంద్రబాబు వద్ద వినిపించేందుకు వెళ్ళిన గంగుల ప్రభాకర్ రెడ్డికి బాబు అపాయింట్ మెంట్ దక్కలేదు.అయితే మనస్థాపానికి గురైన ప్రభాకర్ రెడ్డి టిడిపిని వీడేందుకు సన్నాహలు చేసుకొంటున్నారు. ఈ నెల 15 లేదా 18 తేదిల్లో గంగుల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.