బాబుకు కర్నూలు షాక్లు: అఖిలతో కుదిరాక.. ఏవీకి కీలక పదవి! టీజీ ధీమా అదేనా?
కర్నూలు: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇద్దరు నేతల మధ్య వివాదం సమసిపోతుందో లేదో మరో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి భూమా అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య వివాదం ఏర్పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా కలుగచేసుకొని కలిసి పని చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి వారి వివాదం సద్దుమణిగింది.
సరైన టైంలో చెప్తా, జగన్ వల్ల బాధపడ్డా: పవన్ 'సింగపూర్'పై బాబు కౌంటర్
Recommended Video
అంతలోనే మంత్రి నారా లోకేష్ ఇటీవల టిక్కెట్లపై ఇచ్చిన హామీల కారణంగా ఎంపీ టీజీ వెంకటేష్, ఎస్వీ మోహన్ రెడ్డిల వివాదం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇది వేడి రాజేస్తోంది. తాజాగా, ఆదివారం టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ తన పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు చిత్తూరును వదిలి కర్నూలు నుంచి పోటీ చేయాలని లేదంటే సర్వే చేసి టిక్కెట్ ఇవ్వాలన్నారు.
టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలో, టీడీపీలో కలకలం రేపుతున్నాయి. కర్నూలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడి (కర్నూలు) నుంచే పోటీ చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి పోటీ చేయని పక్షంలో సర్వే ప్రకారమే ఎమ్మెల్యే సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేస్తే జిల్లాలో 14 సీట్లు గెలుస్తామన్నారు.
కర్నూలుపై సీటు పోటీ
టీజీ భరత్ ఇలా మాట్లాడటానికి కారణం ఉంది. ఆయన కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం సీటును ఆశిస్తున్నారు. పార్టీలో ఆయనకు ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ అయ్యారు. దీంతో కొంతకాలంగా ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ మధ్య సీటు పొరు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సమయంలో ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ వర్గీయులు పోటాపోటీగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఉత్సాహం కనబరిచారు.
టీజీ భరత్ ధీమా అదేనా?
అలాంటి సమయంలో నారా లోకేష్ 2019 ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని, ఎంపీగా బుట్టా రేణుకను గెలిపించాలని వ్యాఖ్యానించారు. లోకేష్ అలా మాట్లాడటంపై టీజీ తీవ్రంగానే మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోమని, ఆయన ఏం పార్టీ అధినేత కాదన్నారు. ఎన్నికలకు దాదాపు మరో ఏడాది ఉండగానే, టిక్కెట్ విషయంలో పోటీ ఉన్న సమయంలో లోకేష్ ఆ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కర్నూలుకు వచ్చి పోటీ చేయాలని టీజీ భరత్ వ్యాఖ్యానించడం గమనార్హం. సర్వేలు తమకు అనుకూలంగా ఉంటాయని టీజీ భరత్ ధీమాగా ఉన్నారు. చంద్రబాబు కూడా సర్వే ఆధారంగా గెలిచే అభ్యర్థికి టిక్కెట్లు ఇస్తామని టీడీపీ నేతలకు చెబుతున్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. ఆయన చేరికను టీజీ తొలుత వ్యతిరేకించారు. రాజకీయంగా ఇబ్బంది ఉండదని చంద్రబాబు చెప్పడంతో ఆయన చల్లబడ్డారు. కానీ చంద్రబాబు ప్రకటించేంత వరకు టిక్కెట్ గొడవ కొనసాగేలా ఉంది.
ఏవీ సుబ్బారెడ్డికి కీలక పదవి?
ఇదిలా ఉండగా, అఖిలప్రియ తీరుతో అసంతృప్తితో ఉన్న ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. ఆయనకు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం చంద్రబాబు వారిద్దరితో పాటు భూమా బ్రహ్మానంద రెడ్డిని పిలిపించుకొని కలిసి పని చేసుకోవాలని చెప్పడంతో పాటు రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇశ్తానని ఏవీ సుబ్బారెడ్డికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది.