10ని.ల్లో చేరుకున్నాం: నారాయణ రెడ్డి హత్యపై ఎస్పీ, ట్విస్ట్.. నెంబర్ లేని ట్రాక్టర్!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్యలకు సంబంధించి పోలీసుల నిర్లక్ష్యం ఉందన్న వైసిపి నేతల ఆరోపణలను ఎస్పీ కొట్టి పారేశారు.
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్యలకు సంబంధించి పోలీసుల నిర్లక్ష్యం ఉందన్న వైసిపి నేతల ఆరోపణలను ఎస్పీ రవికృష్ణ సోమవారం కొట్టి పారేశారు.
చదవండి: నారాయణరెడ్డి హత్యలో డిజిపి ట్విస్ట్, అదే వెంటాడి చంపింది!
హత్యలు జరిగిన పది నిమిషాల్లోనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నారాయణ రెడ్డి తుపాకీని డిపాజిట్ చేశారని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తీసుకు వెళ్లలేదని చెప్పారు.
అలాంటి సంఘటన ఒక్కటి లేదు
రెన్యూవల్ కాలేదని వెపన్ సీజ్ చేసిన సందర్భం గత అయిదేళ్లలో జిల్లాలో ఒక్కటీ జరగలేదన్నారు. ప్రాణభయం ఉన్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామని ఎస్పీ రవికృష్ణ తెలిపారు. త్వరలోనే తాము నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
ప్రాణహానీ ఉంటే చెప్పాలి
ప్రాణహానీ ఉన్నవారు హఠాత్తుగానే ప్రయాణాలు చేయడం మంచిదని ఎస్పీ అన్నారు. ముందస్తుగా ఎవరికీ సమాచారం ఇవ్వకూడదని సూచించారు. స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి ప్రయాణాలు చేయాలన్నారు.
కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు
ఫ్యాక్షన్ వల్ల జిల్లాతో పాటు పలు గ్రామాలు చాలా నష్టపోతున్నాయని ఎస్పీ రవికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.
చంద్రబాబు, డీజీపీలు ఇలా..
మరోవైపు, ఈ హత్యలపై సీఎం చంద్రబాబు, డిజిపి సాంబశివ రావులు వేర్వేరుగా స్పందించారు. హత్యకు హత్య సమాధానం కాదని చంద్రబాబు అన్నారు. నారాయణ రెడ్డి పర్సనల్ గన్ రెన్యూవల్లో ఉందని డీజీపీ సాంబశివ రావు చెప్పారు.
ఆ ట్రాక్టర్కు నెంబర్ లేదు
కాగా, ఈ హత్య కేసులో వినియోగించిన రామాంజనేయులు ట్రాక్టరును పోలీసులు సీజ్ చేశారు. సోమవారం తెల్లవారున దానిని సీజ్ చేశారు. అయితే ఈ ట్రాక్టరుపై వస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ట్రాక్టరుకు నెంబర్ లేదని, ఇంకా రిజిస్ట్రేషన్ చేయించలేదని సమాచారం. ట్రాక్టర్ ముందు భాగం వాహనాన్ని ఢీకొట్టినట్లుగా ఉంది.