'రివాల్వర్'పై ఎస్పీ ట్విస్ట్: తప్పు నారాయణ రెడ్డిదే!, హత్యలో కొత్త కోణం..
ఆయుధ లైసెన్స్ను రెన్యువల్ చేసినా.. చేయకపోయినా.. వెపన్ను తీసుకెళ్లవచ్చని చెప్పారు. ఒకవేళ తనిఖీల్లో వెపన్ దొరికితే.. రెన్యువల్కు దరఖాస్తు చేసుకున్నానని చెబితే సరిపోతుందన్నారు.
కర్నూలు: ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైపోయిన పత్తికొండ వైసీపీ ఇన్చార్జీ నారాయణరెడ్డి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. హంతకులకు సహకరించేలా వ్యవహరించారంటూ పోలీసుల మీద ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కర్నూలు ఎస్పీ రవికృష్ణ దీనిపై స్పందించారు.
ఒళ్లు గగుర్పొడిచేలా నారాయణరెడ్డి హత్య: హత్యలోని కోణాలివే!..
నారాయణరెడ్డి రివాల్వర్ లైసెన్స్ను రెన్యువల్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారనడం సరికాదన్నారు రవికృష్ణ. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నారాయణ రెడ్డి తన రివాల్వర్ను పోలీస్ స్టేషన్ లో డిపాజిట్లో చేశారని, ఆ తర్వాత మళ్లీ తీసుకుపోలేదని గుర్తుచేశారు. రివాల్వర్ తిరిగి తీసుకెళ్లకపోవడం ఆయన తప్పేనని పేర్కొన్నారు.
'ఎస్కేప్' ఛాన్స్ లేకుండా: విస్తుపోయే ప్లాన్! నారాయణరెడ్డి హత్య జరిగిందిలా..(ఫోటోలు)
తప్పు నారాయణరెడ్డిదే!:
ఆయుధ లైసెన్స్ను రెన్యువల్ చేసినా.. చేయకపోయినా.. వెపన్ను తీసుకెళ్లవచ్చని చెప్పారు. ఒకవేళ తనిఖీల్లో వెపన్ దొరికితే.. రెన్యువల్కు దరఖాస్తు చేసుకున్నానని చెబితే సరిపోతుందన్నారు. వెపన్ ను తీసుకెళ్లాల్సిందిగా తామే స్వయంగా సమాచారం అందించినప్పటికీ ఆయన స్పందించలేదని ఎస్పీ తెలిపారు. నారాయణ రెడ్డిని హత్య చేసినవారిని త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
హత్యకు పోలీసులే పరోక్షంగా!:
కాగా, నారాయణ రెడ్డి హత్య కేసులో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్న వ్యక్తుల్లా వ్యవహరించారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రివాల్వర్ లైసెన్స్ చేయాలని నారాయణ రెడ్డి ఎన్నిసార్లు పోలీసులకు విన్నవించినా.. పట్టించుకోలేదంటున్నారు. నారాయణ రెడ్డి వద్ద రివాల్వర్ లేని విషయాన్ని ప్రత్యర్థులకు లీక్ చేసి.. ఆయన హత్యకు పరోక్షంగా పోలీసులే కారణమయ్యారని వారు ఆరోపిస్తున్నారు.
కేఈ కుటుంబంపై ఆరోపణలు:
నారాయణ రెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పాత్రధారిగా, సీఎం చంద్రబాబు నాయుడు సూత్రధారిగా వ్యవహరించారని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ రాజకీయాలను ఎదుర్కొనే ధైర్యం లేకనే టీడీపీ హత్యా రాజకీయాలకు తెరలేపుతోందని ఎమ్మెల్యే రోజా సహా పలువురు ఆరోపించారు. మరోవైపు కేఈ మాత్రం ఆరోపణలను తోసిపుచ్చారు. కేసులో తన కుమారుడు, అనుచరుల హస్తం లేదన్నారు. విచారణలో వారి హస్తమున్నట్లు తేలితే.. కఠిన శిక్ష విధిస్తామని అంటున్నారు.
పోలీసులు కావాలనే అలా చేశారా?:
హత్య కేసులో నిందితులకు కొమ్ము కాసేలా పోలీసులు వ్యవహరించారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఉదయం 9.30గం.కు హత్య జరిగితే పోలీసులు మధ్యాహ్నాం వరకు సంఘటనా స్థలానికి ఎందుకు వెళ్లలేదని జగన్ లేవనెత్తిన ప్రశ్నపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సాక్ష్యాధారాలు మాయమవ్వాలన్న దురుద్దేశంతోనే పోలీసులు నిందితులకు పరోక్షంగా సహకరించారని ఆయన ఆరోపించారు. దీంతో నారాయణ రెడ్డి హత్యలో పోలీసుల పాత్రపై అనుమానాలు పెరుగుతున్నాయి.