జగన్ పార్టీకి మరో షాక్: టీడీపీలోకి కర్నూలు నేతలు, పారిశ్రామికవేత్త
అమరావతి/కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, ఎస్.కోట నియోజకవర్గాలకు చెందిన పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం టీడీపీలో చేరారు.
ఉండవల్లిలోని సీఎం నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకున్నారు. కేసీ కెనాల్ ఛైర్మన్ సిద్ధం రెడ్డి జాఫర్ రెడ్డి, పదిమంది కౌన్సిలర్లు, దొండపాడు మండలంలోని బాగ్యనగరం, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన 200మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు.
టీడీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త
విజయనగరం జిల్లా ఎస్. కోట నియోజకవర్గంలోని కొత్తవలసకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వీజె ప్రకాష్ బాబు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు, ఎస్. కోట శాసనసభ్యురాలు లలితకుమారిల ఆధ్వర్యంలో ప్రకాష్ బాబుతోపాటు పలువురు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు అఖిలప్రియ తదితరులు పాల్గొన్నారు.