వైసీపీకి మరో షాక్, జగన్ తీరుపై అసహనం: టీడీపీలోకి కర్నూలు ముఖ్య నేత
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ వైపు పాదయాత్ర చేస్తుండగా మరోవైపు వైసీపీకి షాక్లు తగులుతున్నాయి.
అమరావతి/కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ వైపు పాదయాత్ర చేస్తుండగా మరోవైపు వైసీపీకి షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరనున్నారని ప్రచారం సాగుతోంది. మరికొందరు నాయకులు వైసీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.
జగన్కు ఝలక్: చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు, వైయస్సార్పై విమర్శలు
కర్నూలులో జగన్కు షాక్
ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, వైసీపీ నాయకుడు తూర్పు లింగారెడ్డి టీడీపీ గూటికి చేరనున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఆయన ప్యాపిలిలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఓ వైపు జగన్ కర్నూలులో పాదయాత్ర చేస్తుంటే మరోవైపు లింగారెడ్డి టిడిపిలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు.
సొంతూరుకు సేవ
ప్యాపిలి మండలం చిన్నపూజర్ల గ్రామానికి చెందిన తూర్పు లింగారెడ్డి హైదరాబాదులో ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సొంతూరులో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్, పశువులకు తాగునీరు తొట్లు వంటి వాటిని పేదలకు ఉచితంగా ఇస్తున్నారు.
నాలుగేళ్ల క్రితం వైసీపీలోకి, ఆ తర్వాత దూరం
ఆయన 2013లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయంలో తనవంతు పాత్ర పోషించారు. గత ఏడాదిగా ఆయన వైసిపికి కొంత దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రాలకు హాజరు కావడం లేదు. పార్టీ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న లింగారెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే లింగారెడ్డితో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, డోన్ ఇంచార్జ్ కేఈ ప్రతాప్ మాట్లాడారని తెలుస్తోంది.
తీవ్ర అసంతృప్తిలో వైసీపీలో కొందరు నేతలు
పార్టీ అధినేత జగన్తో పాటు జిల్లా నేతల తీరుపై ఈశ్వరి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె సైకిల్ ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవిబాబును పార్టీలో చేర్చుకోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ మేరకు టీడీపీతో చర్చలు జరుగుతున్నాయి.