కేంద్రమే బ్రోకర్లను పంపించింది: జీవీఎల్కు కుటుంబరావు, పవన్ కళ్యాణ్పై..
అమరావతి: భారతీయ జిమ్మిక్కుల పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు బుధవారం మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇచ్చేసినట్లు, ఏపీ ప్రభుత్వం లబ్ధిపొందినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సాగరమాల ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి ఇచ్చింది రూ.5 కోట్లే అన్నారు.
రిఫైనరీ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బ్రోకర్లను పంపించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సాగరమాలపై చర్చకు రావాలని బీజేపీకి సవాల్ విసిరారు. టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీ పెదవి విప్పారా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి కనీసం మాట్లాడలేకపోతున్నారన్నారు. ఎందుకంటే ఏపీ బీజేపీ నేతలు చెప్పేవి అబద్దాలు కాబట్టి మాట్లాడట్లేదన్నారు.
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ 12 అంశాలతో ప్రధానికి రిప్రజెంటేషన్ ఇచ్చారని, కానీ అమిత్ షా, నరేంద్ర మోడీలు ఏమైనా మాట్లాడారా అన్నారు. ఎందుకంటే ఆ పన్నెండు అంశాలు చేయలేదు కాబట్టే మాట్లాడలేదన్నారు. సిగ్గు, శరంలేక మాట్లాడలేదన్నారు. కానీ తోలుబొమ్మలు మాట్లాడుతారన్నారు.
కేంద్రమంత్రి వద్దకు చంద్రబాబు, లోకేష్లు రాజకీయ బ్రోకర్లను పంపించారని బీజేపీ నేత జీవీఎల్ నర్సింహా రావు ఆరోపించారని, కానీ ఆ యూనియన్ మినిస్టర్ పేరు చెప్పలేదన్నారు. కేంద్రమంత్రి వద్దకు వీరు బ్రోకర్లను పంపిస్తే ఆయన వద్దని చెప్పారట, ఇన్ని అబద్దాలు ఎందుకన్నారు.
అసలు కేంద్ర ప్రభుత్వమే మా వద్దకు రిఫైనరీ ప్రాజెక్టు విషయంలో బ్రోకర్లను పంపించిందన్నారు. రాజకీయ బ్రోకర్లను, కమిషన్ బ్రోకర్లను పంపించారని చెప్పే జీవీఎల్.. పేర్లు చెప్పాలన్నారు. ధైర్యం ఉంటే పేర్లు చెప్పాలన్నారు. జీవీఎల్ నర్సింహా రావు వ్యాఖ్యలకు కుటుంబ రావు కౌంటర్ ఇచ్చారు. తనపై బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులు వ్యక్తిగత విమర్శలు చేశారని, వారికి నోటుసు ఇచ్చామని చెప్పారు.
పవన్ కళ్యాణ్పై విమర్శలు
కుటుంబరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా మండిపడ్డారు. ఆయన తప్పుడు ప్రచారాల బురద ఆయనకే అంటుకుంటుందన్నారు. పవన్ విశాఖలోనే తిరుగుతున్నా రైల్వే జోన్ గురించి మాట్లాడటం లేదన్నారు.