అప్పుడు కాంగ్రెస్ నిర్ణయం కరెక్టే:రోశయ్య; కుటుంబరావుకు టేకింగ్, మేకింగ్ కు తేడా తెలియదు:ఉండవల్లి
విజయవాడ:విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని తాను అనుకోవడం లేదని, పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. సోమవారం ఆయన విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
గుడ్డలూడతీసి...కాళ్లతో తన్నాడు...గిరిజన విద్యార్థులపై ఓ ప్రిన్సిపాల్ దాష్టికం
మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దీనిని సాధించుకోవడానికి పార్టీ శ్రేణులు కష్టపడాలని ఈ సందర్భంగా రోశయ్య చెప్పారు. మరోవైపు టేకింగ్కు, మేకింగ్కు తేడా తెలియకుండా కుటుంబారావు రాజకీయాల్లోకి వచ్చారని ఉండవల్లి అరుణ్కుమార్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షడు కుటుంబారావు తనపై చేసిన విమర్శలను ఉండవల్లి అరుణ్ కుమార్ తిప్పికొట్టారు.
విజయవాడకు...రోశయ్య రాక
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విజయవాడ విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్టీ నేతల ఆహ్వానం మేరకు విజయవాడలోని ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏపీసీసీ సీనియర్ నేతలు ఆయనను సాదరంగా ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రోశయ్య మీడియాతో మాట్లాడుతూ, తాను చాలాసార్లు విజయవాడ వచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి రాలేదని, ఈ రోజు రఘువీరారెడ్డి కోరిక మేరకు ఆంధ్ర రత్న భవన్ కి రావడం జరిగిందని అన్నారు.
కాంగ్రెస్ జండా...ఎప్పుడూ ఎగరాలి
తాను విజయవాడ రావడం పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా కనబడితే చాలు తనకు ఎనలేని ఉత్సాహం వస్తుందని, కాంగ్రెస్ జెండా ఎప్పుడూ ఎగరాలని కోరుకునే వారిలో తాను మొదటి వాడిగా ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన అంశంపై ఆయన మాట్లాడారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని తాను అనుకోవడం లేదని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని రోశయ్య అన్నారు. ప్రస్తుతం పార్టీకి ఏమి చేయాలన్నా తన శక్తి సరిపోదని, ఉన్నవారు మాత్రం శక్తిని కూడగట్టుకొని పార్టీ కోసం పనిచేయాలని కోరారు.
ఇంకో రెండేళ్లు...బ్రతుకుతానేమో?...
ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ...నాకిప్పుడు 87 ఏళ్లు...బహుశా మరో రెండేళ్లు బతుకుతానేమో అని రోశయ్య అన్నప్పుడు...ఒక్కసారిగా ఎపిసిసి కార్యాలయంలో గంభీరమైన వాతావరణం ఆవరించింది. హఠాత్తుగా రోశయ్య అన్న మాటలతో భావోద్వేగానికి లోనైన కాంగ్రెస్ నేతలు రఘువీరా తదిదరులు...ఆయన మాటలపై స్పందిస్తూ మీరు వందేళ్లు నిండు ఆరోగ్యంతో జీవించాలని, మాకు ఎప్పుడూ సలహాలూ, సూచనలూ ఇవ్వాలని కోరారు.
కుటుంబరావు...తేడా తెలియదు
టేకింగ్కు, మేకింగ్కు తేడా తెలియకుండానే కుటుంబారావు రాజకీయాల్లోకి వచ్చారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ ఎద్దేవా చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబారావు...తనపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. రాజకీయాల్లో నీతిమంతులెవరూ ఉండరని ఈ సందర్భంగా ఉండవల్లి తేల్చిచెప్పారు. సీఆర్డీఏ కోసం చంద్రబాబు 21 సార్లు అప్పుతెచ్చారని ఉండవల్లి గుర్తు చేశారు. అమరావతి బాండ్లు, పోలవరం, పట్టిసీమ, గృహనిర్మాణం, పరిశ్రమలపై చర్చకు తాను సిద్ధమని అన్నారు. ఏ విషయంలోనైనా తనది తప్పు అని తేలితే వెంటనే క్షమాపణ కోరతానని ఉండవల్లి స్పష్టం చేశారు.