అప్పుడు గాడిదలు కాస్తున్నారా?...అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై బిజెపి కుట్ర:కుటుంబరావు
అమరావతి:అగ్రిగోల్డ్ అంత పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరిస్తుంటే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మీరు గాడిదలు కాస్తున్నారా?...అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు...ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై మండిపడ్డారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి ఈ నెల 22 నుంచి ధర్నాలు చేయనున్నట్లు బీజేపీ ప్రకటించడంపై కుటుంబరావు తీవ్రంగా స్పందించారు. అగ్రిగోల్డ్ డిపాజిట్లు 2004-2014 సమయంలోనే రూ.6,400 కోట్లకు పెరిగాయని,ఆ సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని...అప్పుడు అగ్రిగోల్డ్ పై విమర్శలు గుప్పిస్తున్న కన్నా లక్ష్మీనారాయణే అప్పుడు సహకారమంత్రిగా పని చేసిన విషయం మరిచిపోతున్నారేమో అని కుటుంబరావు దుయ్యబట్టారు.
ఆనాటి సహకార మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హయాంలోనే సహకార బ్యాంకులకు సంబంధించి అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. అగ్రి గోల్డ్ వ్యవహారంపై నాలుగున్నర సంవత్సరాల తర్వాత ధర్నాలు చేస్తామంటున్న బీజేపీ నేతలు...అగ్రిగోల్డ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు...ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఆ విషయం ఆయననే అడగాలని సూచించారు.
అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం జరగకుండా బీజేపీ కుట్ర చేస్తోందని కుటుంబరావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఒకరు రూ.3,000 కోట్లు, మరొకరు రూ.10వేల కోట్లు, మరికొందరు రూ.30 వేల కోట్లు అంటారని కుటుంబరావు ఆక్షేపించారు. బిజెపి నాయకులు, జగన్, పవన్ కూడబలుక్కునే ఈ వ్యవహారాలు నడుపుతున్నారని అర్థమవుతోందన్నారు.
అగ్రిగోల్డ్ ఆస్తులు ఏజెంట్లకు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వెనుక కన్నా ఆంతర్యం ఏమిటని కుటుంబరావు ప్రశ్నించారు. అగ్రి గోల్డ్ పై రెచ్చిపోయి మాట్లాడుతున్న కన్నా ఈ లెక్కలు గమనించాలన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2002-04 కాలంలో కేవలం అగ్రిగోల్డ్ రూ.84 కోట్ల డిపాజిట్లు సేకరిస్తే...2004-14 మధ్య అగ్రిగోల్డ్ రూ.6400 కోట్ల డిపాజిట్లు సేకరించిందని చెప్పారు.
తక్కువ ధరలకే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మేస్తున్నారని విమర్శలు చేసే కన్నా...మరి మీరే వేలంలో పాల్గొని కొనుగోలు చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. విమర్శలు, ఆరోపణలు చేసే వారు హైకోర్టు పర్యవేక్షణలో సాగుతున్న విచారణలో ఇంప్లీడ్ కావచ్చని కుటుంబరావు సలహా ఇచ్చారు. హాయ్లాండ్ భూముల విలువ రూ.3,000 కోట్లు ఉంటుందంటున్న కన్నా అందులో మూడో వంతు(రూ.1000కోట్లు) బిజెపితో చెప్పి చెల్లించి ఆ ఆస్తులను పార్టీనే తీసుకోవచ్చు కదా అని కుటుంబరావు అడిగారు.
అగ్రిగోల్డ్ ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.2,800 కోట్లుగా లెక్కించామని...అన్ని ఆస్తులు పూర్తి తెల్లధనంతో హైకోర్టు సమక్షంలో కొనుగోలు చేయాల్సిందేనని చెప్పారు. బిజెపి జీవీఎల్ నరసింహారావు టిడిపి ప్రభుత్వం, నేతలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఆయన సాటి ఎంపీపై చేస్తున్న ఆరోపణలకు రుజువులు సమర్పించాలని కుటుంబరావు డిమాండ్ చేశారు. జివిఎల్ పై తగిన చర్యలు తీసుకోవాలంటూ రాజ్యసభ ఛైర్మన్కు తాను లేఖ రాయబోతున్నానని కుటుంబరావు చెప్పారు. దేశమంతా ఇప్పుడు స్కాం...స్కాం అంటోందని...ఎస్సిఎఎం అంట సేవ్ కంట్రీ ఫ్రం అమిత్ షా అండ్ మోడీ అని అర్థమని కుటుంబరావు చెప్పుకొచ్చారు.