నేను చెప్పినట్లు అతిపెద్ద స్కాం బయటకొస్తుంది, పవన్ కళ్యాణ్ను చూసి నేర్చారు: కుటుంబరావు
అమరావతి: బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు వద్ద సబ్జెక్ట్ లేదని ఏపీ ప్రణాళికా సంఘం అధ్యక్షులు కుటుంబ రావు మండిపడ్డారు. జీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏ విషయం పైన కూడా స్పష్టమైన సమాచారం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తన సవాల్కు జీవీఎల్ డొంక తిరుగుడు సమాధానం చెప్పారన్నారు.
ఎయిర్ఏషియా ఎఫెక్ట్, గుర్తుపెట్టుకోండి.. ప్రకంపనలు సృష్టించే స్కాం బయటపెడ్తాం: కేంద్రంపై సంచలనం
అతను చెప్పినవి అబద్దాలని తేలడంతో జీవీఎల్ నర్సింహా రావు అసహనానికి గురయ్యారన్నారు. నేను అడిగిన ప్రశ్నలలో ఒక్క దానికి కూడా ఆయన సమాధానం చెప్పలేదన్నారు. జీవీఎల్ నర్సింహా రావు బహిరంగ చర్చకు రాకుండా పారిపోయి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని జీవీఎల్ నర్సింహా రావు ఆరోపించారని, అందుకు తగిన ఆధారాలు ఉంటే చూపించాలని కుటుంబ రావు సవాల్ చేశారు. తాను నిన్న చెప్పినట్లుగా కేంద్రానికి సంబంధించిన అతి పెద్ద స్కాం తప్పకుండా బయటకు వస్తుందన్నారు. అది తెరపైకి రావడం ఖాయమన్నారు.
2జి స్కాంలో మరిన్ని ఆధారాలు రానున్నాయి
2జీ స్కాం వ్యవహారంపై మరిన్ని ఆధారాలు రానున్నాయని కుటుంబ రావు చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా ఆ పార్టీకి 150కి మించి సీట్లు రావని జోస్యం చెప్పారు. పారిశ్రామిక కారిడార్లపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. కేంద్రం ఏమిచ్చిందో తెలిసేందుకు కేంద్రం నుంచి ఐదుగుర్ని, రాష్ట్రం నుంచి ఐదుగుర్ని అధికారులను అంటే జీవీఎల్ నర్సింహా రావు నిజనిర్ధారణ కమిటీ అంటున్నారన్నారు. ప్రభుత్వ అధికారులపై నమ్మకం లేదా అన్నారు.
జీవీఎల్ చులకనగా మాట్లాడుతున్నారు
జిల్లాల అభివృద్ధిపై జీవీఎల్ ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం మాని, జిల్లాలకు వెళ్లి చూడాలని కుటుంబ రావు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం వెళ్లి ఏ పనులు జరిగాయో చూసి వచ్చి మాట్లాడాలన్నారు. జీవీఎల్ మాట్లాడినవన్నీ అబద్దాలేనని, ఆయన హావభావాల్లోనే తెలుస్తోందన్నారు. తన పట్ల జీవీఎల్ చులకనగా మాట్లాడుతున్నారన్నారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
కన్నాపై ట్యాపింగ్ విమర్శలు సరికాదు
కన్నా లక్ష్మీనారాయణ ఫోన్ను ట్యాపింగ్ చేసినట్లు విమర్శలు చేయడం కాదని, ఆధారాలు బయటపెట్టాలని కుటుంబ రావు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేంద్రం పరిధిలోని అంశమన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను చూసి జీవీఎల్ నేర్చుకున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. కొన్ని నెలల క్రితం పవన్ జేఎఫ్సీ నివేదిక ఇచ్చాక దాన్ని పట్టించుకోకుండా పోయాడన్నారు. జీవీఎల్ కూడా ఇప్పుడు నిజనిర్ధారణ కమిటీ అంటున్నారన్నారు.
గూగుల్లో సెర్చ్ చేసి మాట్లాడుతున్న జీవీఎల్
నగరాల్లో ఉండి యూసీలు ఇవ్వడం లేదని మాట్లాడడం కాదని, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం వెళ్లి వెనకబడిన జిల్లాలకు ఏపీ సర్కారు ఎంత ఖర్చు పెట్టిందో తెలుసుకోవాలని కుటుంబరావు సూచించారు. గూగుల్లో సెర్చ్ చేసి జీవీఎల్ మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ఆయన వైసీపీ నేతలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అగ్రిగోల్డ్ అంశంలో అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. అగ్రిగోల్డ్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ తప్పు చేసిందో స్పష్టంగా చెప్పాలన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పైన ఆగ్రహం
ఆర్థిక ఉగ్రవాదులు చెప్పే మాటలు అలాగే ఉంటాయని, జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, విజయసాయి రెడ్డికి బెయిల్ ఇచ్చేటప్పుడు మత ఉగ్రవాదం కన్నా ఆర్థిక ఉగ్రవాదం చాలా ముప్పు అని న్యాయస్థానం కూడా పేర్కొందని కుటుంబరావు అన్నారు. ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదులు ఇలాంటి ఆరోపణలే చేస్తారని, ఎటువంటి ఆధారాలు ఉన్నా కోర్టుకి వెళ్లొచ్చుకదా అని వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ అంశంలో రాష్ట్ర సర్కారు పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. అసత్యాలతో లేనిపోని విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. అగ్రిగోల్డ్ కేసు మొత్తం హైకోర్టు పరిధిలో ఉందన్నారు.