శిఖండిలా వ్యవహరిస్తున్న బిజెపి ఎంపి జివిఎల్:కుటుంబ రావు
అమరావతి:బిజెపి, టిడిపి నేతల మథ్య మాటల యుద్దం పతాకస్థాయికి చేరింది. తాజాగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రం పట్ల జీవీఎల్ శిఖండిలాగా వ్యవహరిస్తున్నారని కుటుంబరావు వ్యాఖ్యానించారు. బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన కుటుంబరావు.. బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాగరమాల ప్రాజెక్టు కింద కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా?...అంటూ జీవీఎల్కు కుటుంబరావు సవాల్ విసిరారు.
అగ్రిగోల్డ్ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే అగ్రిగోల్డ్ ఏర్పాటు చేశారని కుటుంబరావు గుర్తుచేశారు. కన్నా మంత్రిగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ పురోగతికి ఇతోథికంగా సాయం చేశారని కుటుంబ రావు చెప్పారు. దీనిపై అప్పట్లోనే తాను సెబీకి ఫిర్యాదు చేశారని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేతలు జగన్, విజయసాయిరెడ్డి వాడే భాష అభ్యంతరకరంగా ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తమ భాషను నియంత్రించుకుని మాట్లాడాలని హితవు పలికారు.