జీవీఎల్ ఓ కొత్తకోతి...కొబ్బరిచిప్ప ఇచ్చినట్లు ఆ పదవి ఇచ్చారు;రోగ్ ఎంపి:కుటుంబరావు
"జీవీఎల్ ఓ కొత్త కోతి...కోతికి కొబ్బరిచిప్ప ఇచ్చినట్లు...ఈయనకు బీజేపీ రాజ్యసభ పదవి ఇచ్చింది...వారాంతంలో ఢిల్లీ నుంచి ఇక్కడకు వచ్చి, ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి, తిరిగి ఢిల్లీ వెళ్లిపోవడం ఆయనకు ఆలవాటైపోయింది"...అని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా రాఫెల్ కుంభకోణంపై చర్చ జరుగుతుంటే, ప్రధాని మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని కుటుంబరావు ప్రశ్నించారు.
టిడిపి అధినేత చంద్రబాబు, కుటుంబరావులకు మతి భ్రమించిందన్న బిజెపి ఎంపి జివిఎల్ విమర్శలపై రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఐక్యరాజ్యసమితిలో సిఎం చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని చులకన చేస్తూ ట్వీట్లు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలపై జివిఎల్ చేసిన వాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు. సస్టయినబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ(ఎస్ఐఎఫ్ఎఫ్) పథకం కింద ఫ్రాన్స్కు చెందిన ప్రఖ్యాత బ్యాంకు బీఎన్పీ పారిబా నుంచి ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోలేదని కుటుంబరావు స్పష్టంచేశారు.
అయినా ఎపి గవర్నమెంట్ రూ.16 వేల కోట్ల అప్పు తీసుకుందని జీవీఎల్ ఆరోపిస్తారా?...అందుకే ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు మాట్లాడేందుకు అవకాశమిచ్చారని అంటారా?...ఏమైనా అర్థముందా?...జీవీఎల్ రోగ్ పొలిటీషియన్...రోగ్ ఎంపీ...ఆయనపై రాజ్యసభ కమిటీకి ఫిర్యాదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా ప్రధాని మోడీ ఎక్కువ సార్లు విదేశీ పర్యటనలు చేశారన్నారు.
ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీ 90 సార్లు విదేశీ పర్యటనలు చేశారని, అమెరికా, చైనాల్లో 5 సార్లు పర్యటించి ఆయన ఏం సాధించారో చెప్పగలరా అని కుటుంబరావు నిలదీశారు. మరోవైపు తనకు, అగ్రిగోల్డ్కు ఏం సంబంధం ఉందో బయటపెట్టాలని వైసిపి నాయకులకు కుటుంబరావు సవాల్ విసిరారు. అగ్రిగోల్డ్ విషయంలో తనపై చేసిన వ్యాఖ్యల్ని పార్ధసారధి రుజువు చేయాలని, లేదంటే ఆయనపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని కుటుంబరావు హెచ్చరించారు.
అనంతరం టిడిపి అధికార ప్రతినిధి లంకా దినకర్ మాట్లాడుతూ...బిజేపి ఎంపి జివిఎల్ నర్సింహరావు నోరు అబద్ధాల పుట్ట అన్నారు. జివిఎల్ వాస్తవాలు తెలుసుకోకుండా నోటికొచ్చింది మాట్లాడొద్దని సూచించారు. యూఎస్ఈపీలో చంద్రబాబు ప్రసంగించడాన్ని వైఎస్ జగన్, జివిఎల్ నర్సింహరావు జీర్ణించుకోలేకపోతు న్నారన్నారు. జగన్పై ఉన్న క్విడ్ప్రోకో-సూట్కేసు కంపెనీలపై సిబిఐ-ఈడి కేసులను నీరుగారుస్తూ, మరోవైపు ఏదో ఒక రకంగా చంద్రబాబుపై తప్పుడు కేసులు వేసి వేధించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. బిజేపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాఫెల్ కుంభకోణంపై జేపిసితో విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.