ఎయిర్ఏషియా ఎఫెక్ట్, గుర్తుపెట్టుకోండి.. ప్రకంపనలు సృష్టించే స్కాం బయటపెడ్తాం: కేంద్రంపై సంచలనం
అమరావతి: కేంద్రంలో ప్రకంపనలు సృష్టించే కుంభకోణం త్వరలో వెలుగులోకి రాబోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు.
నిమిషం ఆలోచించకుండా అశోక్ గజపతిరాజు రిజైన్, పవన్ నిన్న పొగిడారు: బాబు, హడలిన ప్రజలు!
కేంద్రాన్ని కదిలించే స్కాంను త్వరలో బయటపెడతామన్నారు. నెల రోజుల్లోనే అన్ని ఆధారాలతో బయటకు వస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరగా ఉండే వ్యాపార సంస్థకు లబ్ధి చేకూర్చారన్న అంశం దేశంలో ప్రకంపనలు సృష్టించబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలన్నారు.
బీజేపీ నేతలారా గుర్తు పెట్టుకోండి, ప్రకంపనలు సృష్టిస్తాం
తాము కచ్చితంగా కేంద్రంలో ప్రకంపనలు సృష్టిస్తామని కుటుంబ రావు బీజేపీ నేతలను హెచ్చరించారు. బీజేపీ నాయకులు దీనిని గుర్తు పెట్టుకోవాలన్నారు. త్వరలో అన్ని వివరాలతో ముందుకు వస్తామని చెప్పారు. అంతేకాదు, కేంద్రం చేసిన అవినీతి పైన, కుంభకోణం పైన ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని కూడా హెచ్చరించారు.
నోబెల్ బహుమతి ఇవ్వవచ్చు
బీజేపీ నేతలు తమ విషయంలో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని కుటుంబ రావు మండిపడ్డారు. గోబెల్స్ మాదిరిగా ప్రచారం చేయడంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావుకు నోబెల్ బహుమతి ఇవ్వవచ్చునని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులపై రాష్ట్రం తరఫున నలుగురిని, కేంద్రం తరఫున నలుగురిని పెట్టి చర్చిద్దామన్నారు. మేం అలా గతంలోనే సవాల్ చేసినా జీవీఎల్ స్పందించలేదన్నారు.
దోలేరాకు ఎక్కువ నిధులు
2016లో ఢిల్లీ - ముంబై ఇండస్ట్రియల్ కారిడార్కు రూ.495 కోట్లు కేంద్రం కేటాయిస్తే, దేశంలో ఉన్న మిగతా వాటికి కేవలం రూ.4.5 కోట్లు మాత్రమే ఇవ్వడం దారుణం అన్నారు. స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) పెడితే శ్రీకాళహస్తి, కృష్ణపట్నం అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని, కానీ దేశంలో 25 నోడ్స్ ఉంటే అందులో అయిదు గుజరాత్లోనే ఉన్నాయని చెప్పారు. ఈ ఐదు నోడ్స్లో కూడా దొలేరాకు ఎక్కువ నిధులు ఇస్తున్నారని చెప్పారు.
క్షమాపణ చెప్పడానికి సిద్ధం
కష్ణపట్నం విషయంలో కేంద్రం అనుమతి ఇవ్వలేదని కుటుంబ రావు ఆవేదన వ్యక్తం చేశారు. యూసీల విషయంలో తమది తప్పని తేలితే తాము క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. కానీ తాము అన్నీ వాస్తవాలే చెబుతున్నామని వ్యాఖ్యానించారు. జీవీఎల్ నర్సింహా రావు సహా ఇతర బీజేపీ నాయకులు ఎవరు కూడా కనీసం వార్డు సభ్యులుగా కూడా గెలవలేరన్నారు. పారిశ్రామిక కారిడార్లు, యూసీలపై తాము ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.
ఎయిర్ ఏషియాలో ఏముంది?
ప్రధానమంత్రి కార్యాలయంలో ఫైల్ కదలాలంటే ఆరు నెలల సమయం పడుతోందని కుటుంబ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తాను చెబుతున్న మాట కాదన్నారు. ప్రతిపక్షాలను ఎక్కడ ఇరికిద్దామని చూస్తున్నారన్నారు. ఎయిర్ ఏషియా విషయానికి వస్తే... అసలు అందులో ఏముందని కుటుంబ రావు ప్రశ్నించారు. ఎవరో వారిద్దరు మాట్లాడుకున్నారన్నారు.
చంద్రబాబు సమర్థులు అని వారు అనుకుంటే
ముఖ్యమంత్రి గారు సమర్థులు, ఈయన చెబితే పనులు అయిపోతాయని, ఈయన పార్టీకి చెందిన వ్యక్తి అక్కడ కేంద్రమంత్రిగా ఉన్నారని వాళ్లు మాట్లాడుకుంటే ఆ రికార్డులు ముందు పెట్టి ఏదో సీఎం చంద్రబాబును, అశోక్ గజపతి రాజును ఇరికించడానికి అన్నట్లుగా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. వారి తోక పత్రిక, ఇక్కడ అపోజిషన్ పత్రిక సాక్షి.. వీళ్లందరు దాని పైన రాస్తారా అని ప్రశ్నించారు. ఇక్కడ ఒక సులభ ప్రశ్న అడుగుతున్నానని, ట్యాపింగ్ దేశంలో అనుమతిస్తున్నారా అన్నారు. వాళ్లేదో చాలా మాట్లాడుకుంటారన్నారు. నేను కూడా మాట్లాడుతూ.. దేవేంద్ర ఫడ్నవీస్కు సులభంగా పని అయిపోతుందని అంటానని, అక్కడ చాలా కనెక్షన్లు ఉన్నాయని చెబుతానని, ఫడ్నవీస్తో పని చేయించుకుంటే మనకు అక్కడే సర్క్యులేషన్ బాగా అవుతుందని, చేసుకుందామంటే ఫడ్నవీస్ నాకు క్లోజ్ అవుతారా అని ప్రశ్నించారు. ఆయనకు అక్కడ పని అయిపోతుందా అన్నారు. ఏమిటి ఈ చిల్లర పాలిటిక్స్, ఈ చిల్లర ఆరోపణలు అన్నారు. ఈ చిల్లర ఆరోపణలు తీసుకొని ఇక్కడ సాక్షి వంటి పత్రికలు రాయడమా అన్నారు. అందులో (ఆడియోలో) ఎక్కడైనా లంచం గురించి ఒక్క పదమైనా ఉందా అన్నారు. తాను రెండు రోజుల నుంచి కేసు మొత్తం చూశానని చెప్పారు.