వైయస్ తర్వాత సీఎం కావాలని..: బొత్సపై కుటుంబరావు సంచలన ఆరోపణలు
అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఏపీ ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ కుటుంబరావు అన్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని చెప్పారు. దీనిపై రాజకీయం చేసేందుకు తాము సిద్ధంగా లేమని అన్నారు.
అగ్రిగోల్డ్ సమస్య తేలకుండా ఉండేందుకు ప్రతిపక్షం చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీకావని అన్నారు. సమస్యను జఠిలం చేసేందుకు సాక్షి దినపత్రికలో కథనాలు రాస్తున్నారని కుటుంబరావు మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితుల ఉసురంతా ప్రతిపక్షానికే తగులుతుందని అన్నారు. అగ్రిగోల్డ్ అంశంపై తనకు అవగాహన ఉంది కనుక బాధితులకు త్వరిత గతిన న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఈ కేసులో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని కుటుంబరావు మండిపడ్డారు. కోర్టును కూడా తప్పుపట్టే విధంగా బొత్స మాట్లాడుతున్నారని, ఈ విధంగా మాట్లాడొచ్చా? లేదా? అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తామని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదని అన్నారు.
తాను ప్రభుత్వం నియమించిన కమిటీలో ప్రతినిధిని అని, అగ్రిగోల్డ్ వ్యవహరమంతా చూస్తున్నానని కుటుంబరావు తెలిపారు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు తన వద్ద సమగ్ర సమాచారం ఉందని చెప్పారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకునే బొత్సకు క్రెడిబిలిటీ ఉందా? అని ఓ అధికారిగా కాకుండా, ఓ పౌరుడిగా ప్రశ్నిస్తున్నానని కుటుంబరావు చెప్పారు.
నిర్భయ కేసు విషయంలో అర్ధరాత్రి అమ్మాయిలు బస్సుల్లో ఎందుకు ప్రయాణించాలని బొత్స వ్యాఖ్యానించారని, అప్పుడే అతని వైఖరెంటో అర్థమైపోయిందని కుటుంబరావు అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు సీఎం అవ్వాలని కూడా బొత్స ప్రయత్నించారని కుటుంబరావు సంచలన ఆరోపణలు తెరపైకి తెచ్చారు.