అమరావతిని కాపాడాలని ప్రవాసాంధ్రుల విజ్ఞప్తి .. పీఎం మోడీకి లేఖ
రాజధాని అమరావతిలో రైతుల పోరాటానికి సంఘీభావంగా ప్రవాసాంధ్రులు ముందుకు వస్తున్నారు . అమరావతిని కాపాడుకుందామని వారు గళం విప్పుతున్నారు . రైతుల కోసం ఉద్యమిస్తామని ప్రకటించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలోనే కాకుండా , ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు సైతం రాజధానిగా అమరావతినే కొనసాగాలని కోరుతున్నారు.
అమరావతి భూముల కుంభకోణం.... ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఈడీ కేసు నమోదు
చెన్నైలో ధర్నా చేసిన ప్రవాసాంధ్రులు
ఇక నిన్నటికి నిన్న చెన్నైలో అమరావతికి మద్దతుగా ఆందోళన జరిగింది. చెన్నై నుండి అమరావతికి పాదయాత్ర చేపట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతామని పలువురు పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా కేవలం అమరావతి రైతుల పోరాటానికి మద్ధతుగా తమిళనాడు తెలుగు సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చెన్నైలో నుంగంబాక్కంలోని వళ్లువర్కొట్టంలో ధర్నా నిర్వహించారు.ఇక తాజాగా కువైట్ తెలుగు సంఘాలు కూడా రాజధాని అమరావతికి మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
నరేంద్రమోడీకి లేఖ రాసిన కువైట్ ప్రవాసాంధ్రులు
కువైట్లో ఉన్న యాభైకి పైగా తెలుగు సంఘాలు తెలుగు సంఘాల ఐక్య వేదిక పేరుతో రాజధాని అమరావతి కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతిని కాపాడండి అంటూ లేఖను రాశారు. 2014లో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా పోయిందని , ఆ తరుణంలో అప్పటి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముప్పై మూడు వేల ఎకరాలను రైతుల దగ్గరనుండి సేకరించి , అక్టోబరు 2015 లో నరేంద్ర మోడీ గారి చేతులమీదుగా అమరావతి నగర నిర్మాణానికి శంఖుస్థాపన జరిగిందన్న విషయాన్ని వారు లేఖలో గుర్తు చేశారు.
అధికార వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్టణం కు తరలించాటనికి ప్రయత్నం
గత నాలుగు సంవత్సరాలలో ఎనిమిది వేల కోట్లకుపైగా ఖర్చుపెట్టి రోడ్లు భవనాలను నిర్మించటం జరిగిందని పేర్కొన్న ప్రవాసాంధ్రులు ఏప్రిల్ 2019 లో జరిగిన అసంబ్లీ ఎన్నికల్లో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పార్టీ అయిన వైసీపీ విజయాన్ని సాధించటంతో రాజధాని అమరావతి మార్చాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాజాధాని మీద వివిధ కమిటీలను నియమించి, వారి సలహా సూచనల మేరకు రాజధానిని అధికార వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్టణం కు తరలించాటనికి అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి ఆ దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు.
కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని అమరావతిని కాపాడాలని విజ్ఞప్తి
ఇక మోడీ చేతులమీదుగా శంఖుస్థాపన జరిగిన అమరావతిని ప్రపంచ ప్రఖ్యాత పట్టణాలైన న్యూయార్క్, లండన్, సింగపూర్, పారిస్ లకు పోటీగా నిర్మిచవలసింది పోయి కనుమరుగయ్యే పరిస్థితి తీసుకువస్తున్నారని ఆ లేఖలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో మీరు, కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని అమరావతిని కాపాడవలసింది గా తెలుగు సంఘాల ఐక్య వేదిక కువైట్ తరుపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.