జనసేనలో చేరిన విష్ణురాజు, పార్టీలో చేరగానే కీలకపదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్
అమరావతి: ప్రముఖ విద్యావేత్త కేవీ విష్ణురాజు మంగళవారం నాడు జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.
అందుకే పార్టీలోకి ఆహ్వానించా
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. భీమవరంలోని డాక్టరు బీవీ రాజు ఫౌండేషన్ చైర్మన్ అయిన విష్ణురాజుని తాను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. ఆయన తమ కళాశాలను నడిపే విధానం తనను అమితంగా ఆకట్టుకుందన్నారు. పాలసీ మేకింగ్, పార్టీకి దిశానిర్దేశం విషయంలో గానీ తన పాత్ర ఉంటుందని విష్ణు రాజు చెప్పడంతో పార్టీలోకి ఆహ్వానించానని చెప్పారు.
పార్టీలోకి రాగానే కీలక పదవి
విష్ణురాజు పార్టీలోకి రాగానే ఆయనకు జనసేనాని కీలక పదవి ఇచ్చారు. పార్టీ అడ్వయిజరీ చైర్మన్గా ఆయనను నియమించారు. ఈ సందర్భంగా విష్ణురాజు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ను రెండుమూడుసార్లు కలిశానని, సమాజానికి ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో తాను ఉన్నానని చెప్పారు. పవన్ పాలసీ, ఫిలాసపీ తనకు బాగా నచ్చిందని చెప్పారు. రాష్ట్రం కోరుకుంటే మంచి మార్పు తీసుకొచ్చేందుకు జనసేనాని సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పవన్, జనసేన టీంకు తాను పూర్తిగా సహకరిస్తానని, పార్టీ కోసం ఎలా ఉపయోగపడతాననుకుంటే అలా ఉపయోగించుకోవచ్చునని చెప్పారు.
పవన్ కళ్యాణ్కు నాదెండ్ల ప్రశంస
ఏపీకి ఏదైనా సేవ చేయాలనే ఆలోచనతో విష్ణురాజు జనసేనలో చేరారని, ఇలాంటి వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ను ప్రశంసిస్తున్నానని పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ అభివృద్ధికి విష్ణురాజు తోడ్పడతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.