కెవిపికి అంటే ఎలా: దగ్గుబాటి ఢీ, పురంధేశ్వరిపై వివరణ
విభజనకు వ్యతిరేకంగా పోరాడిన మేం అభ్యర్థిని గెలిపిస్తే తాము అధిష్టానానికి లొంగిపోయామని ప్రజలు భావిస్తారన్నారు. తెలంగాణపై ప్రకటన వచ్చాక రాజీనామా పత్రాల పైన సంతకాలు పెట్టించింది కెవిపి రామచంద్ర రావేనని, ఇప్పుడు ఆయనకే ఓటు వేయమని చెబితే ఎలా అని ప్రశ్నించారు.
ఓటు వేసేందుకు తన మనసుకు నచ్చలేదన్నారు. సీమాంధ్రులకు అన్యాయం చేసినందువల్లే తాను తిరస్కరణ ఓటును ఉపయోగించుకున్నానని తెలిపారు. తనకు రాజకీయాలు లేకపోయినా ఫర్వాలేదని చెప్పారు. తన నిర్ణయంలో తన సతీమణి, కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అధిష్టానం తమ గొంతు పైన కత్తి పెట్టి విభజన చేస్తోందని ధ్వజమెత్తారు.
విభజన సమయంలో ముఖ్యమంత్రి రాజీనామా నాటకం ఆడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ వేరుగా ఆరోపించారు. ఇప్పటికైనా నాటకాలు కట్టిపెట్టి రాష్ట్ర సమైక్యతకు కృషి చేయాలని సీఎంను కోరుతున్నానన్నారు. రాజీనామా చేసి సిఎం పదవి తెలంగాణ వారికి ఇచ్చేందుకు కిరణ్ చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రం విడిపోవాలని కెసిఆర్, జగన్ కోరుకుంటున్నారని, విడిపోతేనే వారికి లాభమన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.