తెరపైకి వైఎస్ ఆత్మబంధువు: ప్రధానికి లేఖ, అమరావతికి కొలికి
హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మబంధువుగా ప్రకటించుకున్న కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు మళ్లీ తెరమీదికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోకి విదేశీ కంపెనీలను అనుమతించడాన్ని తప్పుపడుతూ ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు.
కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నప్పటికీ వైయస్ మరణం తర్వాత దాదాపు మౌనంగా ఉండిపోయారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి దక్కవలసిన ప్రత్యేక హోదా అంశంలో టిడిపి-బిజెపి విఫలం కావడాన్ని ఆయన ప్రశ్నించారు కూడా. ప్రత్యేక హోదాపై రఘువీరారెడ్డి నేతృత్వంలోని పీసీసీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు మొదలుపెట్టింది. కోటి సంతకాల సేకరణ చేపట్టారు.
ఈ నేపథ్యంలో కె విపి తిరిగి తెరపైకి వచ్చారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రూపొందించి, అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి, హోదా అంశానికి మళ్లీ జాతీయ స్థాయి ప్రచారం సాధించడంలో కెవిపి విజయం సాధించారు. చిరంజీవి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, జెడి శీలం సహా.. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటివరకూ బయటకు రాని మాజీలందరినీ ఒకేచోట చేర్చి, వారి ద్వారా కార్యకర్తల్లో కదలిక తీసుకురావడంలో కెవిపి విజయం సాధించారు.
ప్రత్యేక హోదా అంశాన్ని జాతీయ మీడియా దృష్టి ఆకర్షించేలా కెవిపి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాజ్యసభలో కూడా హోదాపై జరిగిన చర్చలో ఘాటుగా మాట్లాడారు. ఢిల్లీలో రోజుకు కొందరిని కలిసి మద్దతు కోరడం, ఏపిలో తాము సేకరించిన కోటి సంతకాల కార్యక్రమాల ముగింపు సమావేశానికి సోనియా, రాహుల్ను రప్పించడం వంటి చర్యల ద్వారా కాంగ్రెసుకు జీవం పోశారు.
ఇదిలా ఉంటే, అమరావతికి పర్యావరణ అనుమతులపైనా కెవిపి సీరియస్గా దృష్టి సారించారు. అమరావతికి పర్యావరణ అనుమతులు ఎలా ఇస్తారంటూ, ప్రధానికి ఘాటుగా లేఖ రాశారు. అమరావతిపై ఆశలు పెట్టుకున్న చంద్రబాబును కష్టాల్లోకి నెట్టడంతోపాటు, అమరావతికి పర్యావరణ అనుమతుల అంశంపై జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపారు. తద్వారా చంద్రబాబును ఇరకాటంలో పెట్టే పనికి పూనుకున్నారు.