ఇలాంటి రోజు వస్తుందనుకుంటే: కేవీపీ ఆసక్తికరం, పొరపాటు అంగీకరించారా?
విజయవాడ: విభజన అనంతరం ఇలాంటి ఓ రోజు (ఏపీకి ఆర్థిక ఇబ్బందులు, ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం) వస్తుందని కాంగ్రెస్ పార్టీ అనుకోలేదని, అలా అనుకొని ఉంటే ముందు జాగ్రత్తలు తీసుకునేందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు గురువారం నాడు అన్నారు.
బాబు! పోలవరం కమీషన్ల కోసమా?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందని, అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు ఎందుకు తీసుకున్నదని కేవీపీ ప్రశ్నించారు. పోలవరం అథారిటీ డీజేన్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్మిస్తోందన్నారు.
అలాగే, ప్రత్యేక హోదాను పక్కన పెట్టి, ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎందుకు టిడిపి అంగీకరించేందుకు సిద్ధమయిందని ప్రశ్నించారు. ప్యాకేజీలో వచ్చే లాభం, కమిషన్ల కోసమే పోలవరం నిర్మాణం, ప్యాకేజీకి అంగీకరిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా పోలవరాన్ని కేంద్రానికి అప్పగించాలన్నారు. రాజధాని నిర్మాణ బాధ్యతలను కూడా కేంద్రానికి అప్పగించాలన్నారు.
ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు
విభజన నేపథ్యంలో ఏపీకి ఇలాంటి రోజు వస్తుందని తాము (కాంగ్రెస్) అనుకోలేదన్నారు. అలా అనుకొని ఉంటే ముందు జాగ్రత్తలు తీసుకునే వారమి చెప్పారు.
ప్రయివేటు మెంబర్ బిల్లుపై..
తాను ప్రత్యేక హోదా పైన ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు కోసం చేయని ప్రయత్నం లేదన్నారు. టిడిపి కుతంత్రాలతోనే సఫలీకృతం కాలేకపోయానని చెప్పారు. ఏపీకి రావాల్సినవి అన్నింటిని సాధించే వరకు తన పోరాటం ఆగదని చెప్పారు.
కాగా, కాంగ్రెస్ ముందు జాగ్రత్తలు తీసుకునేదని చెప్పడం ద్వారా ప్రత్యేక హోదా విషయంలో తాము పొరపాటు చేశామని కేవీపీ భావిస్తన్నారా? బీజేపీ, టిడిపిలు ఇప్పటికే దానిని ఎత్తి చూపిస్తున్నారని అంటున్నారు. ప్రత్యేక హోదా బిల్లును చట్టంలో చేర్చలేదని విపక్షాలు చెబుతున్నాయి.
రఘువీరా ఆగ్రహం
ఏపీకి ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. పరిశ్రమలకు రాయితీ ఉండాలన్నారు. రైల్వే జోన్ వంటి విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలన్నారు. లేదంటే బీజేపీ, టిడిపిని ప్రజలు తరిమి కొట్టే రోజు ముందుందన్నారు. టిడిపి దొంగాట ఆడి రాష్ట్రాన్ని పాడు చేయవద్దని హెచ్చరించారు.