టీలో కెవిపి హస్తం: సూరీడికి కూకట్పల్లి టికెట్?
సూరీడికి కూకట్పల్లి శాసనసభ కాంగ్రెసు టికెట్ ఇప్పించేందుకు కెవిపి రామచందర్ రావు ప్రయత్ాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కూకట్పల్లి నుంచి ప్రస్తుతం జయప్రకాష్ నారాయణ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో లోకసభకు పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ స్తితిలో సూరీడు కూకట్పల్లి నుంచి విజయం సాధించడానికి అవకాశాలుంటాయని కెవిపి భావిస్తున్నట్లు సమాచారం.
కూకట్పల్లి నియోజకవర్గంలో సీమాంధ్ర ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ కారణంగానే గత ఎన్నికల్లో జెపి గెలిచారని అంటున్నారు. సూరీడికి సీమాంధ్ర ఓటర్ల మద్దతు లభిస్తుందని కెవిపి అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, పొన్నాల లక్ష్మయ్య గతంలో వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఆయన ప్రభుత్వంలో పొన్నాల భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.
జలయజ్ఞం ప్రాజెక్టులను వైయస్ రాజశేఖర రెడ్డి 2004లో ప్రారంభించారు. జలయజ్ఞం ప్రాజెక్టులు ప్రారంభమైనప్పుడు పొన్నాల భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ జలయజ్ఞం ప్రాజెక్టుల నేపథ్యంలో కెవిపి పొన్నాలను తెర మీదికి తెచ్చినట్లు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెసు గెలిస్తే పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి అవుతారని, తద్వారా తెలంగాణలో తన పట్టు కొనసాగుతుందని కెవిపి భావిస్తున్నారంటూ జాతీయ మీడియాలో వార్తాకథనం వచ్చింది.
పొన్నాలను టీపిసిసి అధ్యక్షుడిగా నియమించడంలో తన హస్తం ఉందంటూ వచ్చిన వార్తలను కెవిపి ఖండిస్తున్నారు. తెలంగాణకు చెందిన కొంత మంది నాయకులు తనపై బురద చల్లుతున్నారని ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గానికి తన పేరును పొన్నాల లక్ష్మయ్య జాబితాలో చేర్చినట్లు సూరీడు టైమ్స్ ఇండియాతో చెప్పారు. తనకు స్థానిక నాయకుల మద్దతు ఉందని కూడా ఆయన చెప్పారు. సూరీడు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ను కూడా కలిసినట్లు చెబుతున్నారు.