అమెరికాలో కేసుపై కెవిపి, విదేశాల వరకు: యనమల
హైదరాబాద్: టైటానియం మైనింగ్ కుంభకోణంలో షికాగో న్యాయస్థానం తనపై అభియోగాలు మోపడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు స్పందించారు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. దర్యాప్తు సంస్థ తన నివేదికను బయటపెట్టాలని కోరారు. అమెరికా న్యాయ విభాగం, దర్యాప్తు సంస్థ నివేదిక అందాక మాట్లాడతానని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన హృదయంలోనే ఉన్నారని, తాను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనని ఆయన చెప్పారు. నిరాధార ఆరోపణలపై తాను వ్యాఖ్యానించనని, వివరాలు అందాక తన అభిప్రాయం చెబుతానని అన్నారు.
విదేశాల వరకు వైయస్ అవినీతి: యనమల
వైయస్ రాజశేఖరరెడ్డి అవినీతి విదేశాల వరకూ వెళ్లిందని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గురువారం అన్నారు. వైయస్ తన ఆత్మకు, తనయుడికి లక్షల కోట్లు దోచిపెట్టారన్నారు. ఆర్థిక నేరస్థులు కెవిపి, జగన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టాన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ పార్టీ నేతలు ఓట్ల కోసం దొంగనోట్లు పంచుతున్నారని ఆయన ఆరోపించారు.
కాగా, కెవిపి రామచందర్ రావుపై మీడియా గురువారంనాడు బాంబు పేల్చిన విషయం తెలిసిందే. తెలుగులోని రెండు ప్రముఖ తెలుగు దినపత్రికల్లో కెవిపి రామచందర్ రావుపై అమెరికాలోని చికాగోలో కేసు నమోదైన విషయానికి సంబంధించిన వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఎన్నికల వేళ కాంగ్రెసుకు ఇది శరాఘాతమే కానుంది.
మీడియా కథనాల ప్రకారం - ఆంధ్రప్రదేశ్లో టైటానియం ఉత్పత్తులకు అవసరమైన ఖనిజాన్ని వెలికితీసి, అంతర్జాతీయ స్థాయిలో విక్రయించి, కోట్లు మూటగట్టుకునేందుకు ప్రయత్నం చేసినట్లు, ఇందులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో 1.85 కోట్ల డాలర్లు (మన లెక్కలో చెప్పాలంటే 110.81 కోట్ల రూపాయలు) లంచాలుగా ఇచ్చేందుకు కుట్ర పన్నారని తేలింది. ఇందులో సుమారు 64 కోట్ల సొమ్ము బట్వాడా అయినట్లు సమాచారం.
ఈ అక్రమ వ్యాపారం అమలుకు తమ దేశ భూభాగాన్ని, తమ దేశంలోని ఆర్థిక వ్యవస్థలను ఉపయోగించుకున్నారంటూ అమెరికాలోని చికాగో ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. దీన్ని అంతర్జాతీయ కుంభకోణంగా, ద్రవ్య అక్రమ చలామణీగా అభివర్ణించింది. గత ఏడాది జూన్ 13వ తేదీన ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ సీల్ చేసిన ఈ కేసు వివరాలను బుధవారం వెల్లడించింది.
ఈ అంతర్జాతీయ ముఠా నుంచి కెవిపి తనకోసం, తన తరఫు వారి కోసం ముడుపులు ఆశించారంటూ ఆయనపై గరిష్ఠంగా ఐదు అభియోగాలు మోపింది. కెవిపితో పాటు హంగేరీకి చెందిన వ్యాపారి ఆండ్రస్ నాప్, ఉక్రెయిన్కు చెందిన సురెన్ జెవొర్గ్యాన్, అమెరికాలో స్థిరపడిన భారతీయుడు గజేంద్ర లాల్, శ్రీలంకకు చెందిన పెరియస్వామి సుందరలింగంలపైనా అభియోగాలు నమోదు చేసింది. "అంతర్జాతీయ స్థాయి అవినీతిపై మా న్యాయవిభాగం పోరాడుతుంది.
ఈ ఆరుగురు విదేశీయులపై అభియోగాలు నమోదు చేయడంద్వారా... ఎవరు, ఎక్కడ విదేశీ అధికారులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినా ఊరుకునేది లేదని గట్టి సంకేతాలు పంపినట్లయింది'' అని న్యాయ విభాగం (క్రిమినల్ డివిజన్) అసిస్టెంట్ అటార్నీ జనరల్ (ఇన్చార్జి) డేవిడ్ ఓనీల్ ప్రకటించారు. ఈ కేసు వివరాలను ఆయనే వెల్లడించారు. ఈ ఆరుగురు 'నిందితుల'కు సంబంధించిన 1.05 కోట్ల డాలర్ల (సుమారు 64కోట్ల రూపాయల) విలువైన ఆస్తులను జప్తు చేయాలని అభియోగ పత్రాల్లో చెప్పారు.
ఈ లావాదేవీల్లో కీలకపాత్ర పోషించిన ఉక్రెయిన్ జాతీయుడైన దిమిత్రీ ఫిర్తాష్ అనే నిందితుడిని గతనెల 12వ తేదీన అరెస్టు చేశారు. 1.74 కోట్ల డాలర్ల పూచీకత్తు ఇచ్చాక 21వ తేదీన ఆయనకు బెయిల్ లభించింది. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఫిర్తాష్ ఆయనను కలిసినట్లు అభియోగ పత్రాల్లో చెప్పారు.