కెవిపి బిల్లు కథ ముగిసినట్లే: బిజెపికి దెబ్బ, చంద్రబాబుదే పైచేయి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుతూ కాంగ్రెసు సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేట్ బిల్లు కథ రాజ్యసభలో ఇక ముగిసినట్లే. కెవిపి మాటలను బట్టి దానిపై శుక్రవారంనాడు కూడా ఓటింగ్ జరిగే అవకాశాలు లేనట్లు అర్థమవుతోంది. ఓటింగుకు రాకుండా బిల్లును బిజెపి అడ్డుకోగలిగిందని కెవిపి అన్నారు.
మనీ బిల్లు అనే సాకు చూపి బిజెపి రాజ్యసభలో నెట్టుకొచ్చింది. అయితే, రాజకీయంగా బిజెపికి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నష్టం వాటిల్లే పరిస్థితిని కల్పించింది. కాంగ్రెసు నుంచి వలస వచ్చిన బడా నాయకులతో రాష్ట్రంలో విస్తరించాలనే ఉద్దేశంతో బిజెపి ఉంది. అయితే, ప్రత్యేక హోదా సెంటిమెంట్ రాష్ట్రంలో బలంగా ఉంది. ఆ కారణంగా బిజెపిపై ప్రజలు వ్యతిరేకత ప్రదర్శించే అవకాశం ఉంది.
ట్విస్ట్-కేవీపీదీ మనీ బిల్లా?: హోదాపై రాజ్యసభకు అధికారం లేదని జైట్లీ
కాగా, బిల్లుకు మద్దతు పలకడం ద్వారానే కాకుండా కేంద్రాన్ని కూడా ధిక్కరించగలమనే సంకేతాలను తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి పంపించింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టిడిపి సభ్యుడు సిఎం రమేష్ మంగళవారం రాజ్యసభలో మాట్లాడిన తీరు ఆ ప్రయోజానాన్ని నెరవేర్చింది. ఆ రకంగా బిజెపిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా పై చేయి సాధించినట్లే లెక్క.
కాంగ్రెసుకు లాభిస్తుందా.....
ప్రత్యేక హోదా బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా కెవిపి రామచందర్ రావు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని చిక్కుల్లో పడేశారు. అయితే, అది కాంగ్రెసుకు ఎపిలో ఏ మాత్రం లాభిస్తుందనేది చెప్పడం కష్టమే. రాష్ట్రంలో కాంగ్రెసు కోలుకోలేని స్థితిలో పడింది.
జగన్కు జవాబు...
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ బిజెపిని పక్కన పెట్టి, చంద్రబాబును మాత్రమే ప్రత్యేక హోదా విషయంలో తప్పు పడుతూ వస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి టిడిపి సమాధానం చెప్పినట్లయింది. తాము ప్రత్యేక హోదా కోసం ఎంత దూరమైనా వెళ్తామనే సంకేతాలను ఇచ్చింది. జగన్కు రాజకీయంగా ఇది నష్టం కలిగించే విషయమే...
చంద్రబాబుకు మేలే జరిగింది...
కెవిపి రామచందర్ రావు ప్రతిపాదించిన బిల్లు వల్ల చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ ఎక్కువగా ప్రయోజనం పొందే అవకాశాలున్నాయి. తాము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమనే సంకేతాలను ప్రజల్లోకి చంద్రబాబు పంపించగలిగారు. రాజ్యసభలో అటు రచ్చ జరుగుతుండగానే చంద్రబాబు ఇటు విజయవాడులో బిజెపిని కూడా తప్పు పడుతూ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ దారేది....
ప్రత్యేక హోదాపై కొంత కాలం ఆగి చూద్దామని, రాష్ట్రానికి బిజెపి న్యాయం చేయాల్సిందేనని చెప్పిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయనేది తేలడం లేదు. ఆయన బిజెపిని వ్యతిరేకిస్తే తప్ప జనసేన రాజకీయంగా ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు.
గర్జిస్తున్న హీరో శివాజీ ఏం చేస్తారో...
ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులను, బిజెపి నాయకులను దుమ్మెత్తి పోస్తున్న హీరో శివాజీ రాజకీయ లక్ష్యం ఏమిటనేది తెలియడం లేదు. ఇప్పటికిప్పుడైతే ఆయన వెంట వామపక్షాలు ఉన్నట్లు అనిపిస్తోంది. ఆయన ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.
వెంకయ్యనాయుడికి చిక్కులే...
పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టి అప్పటి యుపిఎ ప్రధాని మన్మోహన్ సింగ్తో ప్రకటన చేయించిన ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి మాత్రం రాష్ట్రంలో చిక్కులు తప్పేట్లు లేవు. అయినా ఆయన రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక కాలేదు కాబట్టి తప్పించుకోవడానికి వీలు కలుగవచ్చు.