వైయస్ ఆత్మ కేవీపీ.. మరి జగన్ ఆత్మ ఆయనేనా..? అందుకే అంత ప్రాముఖ్యత ఇస్తున్నారా.??
అమరావతి/హైదరాబాద్ : దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు తండ్రికి ఆత్మగా ఉన్న కేవీపీ స్థానాన్ని ఇప్పుడు విజయసాయిరెడ్డి తీసుకున్నారు. జగన్, విజయసాయి రెడ్డి మధ్య ఎంతో గౌరవబంధం కొనసాగుతోంది. తండ్రికి కేవీపీ తరహాలోనే విజయసాయిరెడ్డిని తన ఆత్మగా మలచుకున్నాడు జగన్. ప్రభుత్వంలో, పార్టీలో ఏ పని కావాలన్నా జగన్ కంటే ముందు విజయసాయితో చెబితే చాలన్న పరిస్థితి ఉంది. అలాగే జగన్ కూడా అన్ని విషయాలు విజయసాయికే అప్పగిస్తున్నారు. జగన్ కంపెనీల్లో ఆడిటర్గా మొదలైన విజయసాయి ప్రస్థానం.. తర్వాత ఎన్నో మలుపులు తిరిగి ఇప్పుడు జగన్కు అత్యంత అప్తుడిగా మారేలా చేసింది.
ఇది ఆత్మల సీజన్..! జగన్ కు ఆయనే ఆత్మనా..?!!
ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పాలన వ్యవహారాలు.. ఆయన వ్యక్తిగత వ్యవహారాలన్నీ కేవీపీ రామచంద్రరావే చక్కబెట్టారు. ఏ పని ఉన్న వైఎస్ కంటే ముందుగా కేవీపీని కలిసేవారు. కేవీపీ చెబితే చాలు.. వైఎస్కు చెప్పినట్టే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కాలేజీలో సీనియర్ అయిన కేవీపీని తన వ్యక్తిగత సహాయకుడిగా వైఎస్ నియమించుకున్నారు. వైఎస్ సీఎం కాకమునుపు నుంచి కేవీపీ ఆయనతో ఉంటూ రాజకీయ వ్యవహారాలన్నీ చక్కబెట్టారు. వైఎస్ కూడా కేవీపీని నమ్మినంతగా ఇంకెవర్ని నమ్మేవారు కాదు. అంతేనా కేవీపీ చెబితే ఎంత పని అయినా చేసేవారు. కేవీపీని రానివ్వకపోతే ఎంతటి పెద్ద మీటింగులకైనా వెళ్లేవారు కాదు. ఇదే స్నేహం వైఎస్ చనిపోయేవరకు కోనసాగింది.
విడదీయని బంధంగా కేవీపి, వైయస్..! ఇప్పుడు జగన్ తో సాయిరెడ్డి..!!
వైసీపీలో, ఏపీ ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. నిజానికి కేవీపీ, విజయసాయి ఇద్దరూ తండ్రి తనయులకు ఆత్మలుగా మారడం వెనుక రాజకీయ అనుబంధం ఏమీ లేదు. వారిద్దరూ రాజకీయేతర పరిచయాలతోనే అనుబంధం మొదలై.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. మరో సారూప్యం ఏమిటంటే.. తండ్రి తనయులకు ఆత్మలుగా ఉన్న ఇద్దరూ కూడా రాజ్యసభ సభ్యులుగా ఉండటం విశేషం. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ సలహాదారుగా కేవీపీని నియమించుకున్నారు వైయస్. పాలనలో ఆయన మార్కు స్పష్టంగా కనిపించేది. వైఎస్తో ఏ పని ఉన్నా ముందుగానే కేవీపీనే సంప్రదించేవారు. వైఎస్ కూడా ఆ పనులకు సంబంధించి మంచిచెడూ కేవీపీతోనే ఎక్కువగా మాట్లాడి నిర్ణయం తీసుకునే వారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అందుకే అప్పట్లో వైఎస్కు ఆత్మగా కేవీపీని సంబోంధించేవారు. ఆ తర్వాత కేవీపీకి వైఎస్ రాజ్యసభ సభ్యత్వం ఇప్పించారు. వైఎస్ చనిపోయేవరకు కాంగ్రెస్లో కొనసాగడం, కాంగ్రెస్ విధేయుడిగా ఉండేవారు. ఆ విధేయతతోనే కేవీపీ కూడా కాంగ్రెస్ను వీడలేదు. కాంగ్రెస్లోనే ఉంటూ రెండోసారి రాజ్యసభకు ఎంపికై కొనసాగుతున్నారు.
పార్టీలో సాయిరెడ్డికి ఎంతో ప్రాముఖ్యత..! జగన్ తర్వాత రెండో స్థానం ఆయనదే..!!
ఇప్పుడు ఏపీలో విజయసాయి కూడా ఇంచుమించు కేవీపీ పాత్రనే పోషిస్తున్నారు. వాస్తవానికి కేవీపీ కంటే యాక్టివ్ పొలిటిషయన్గా మారారు. జగన్ కంపెనీలకు ఆడిటర్గా విజయసాయి ప్రస్థానం మొదలెట్టారు. అయితే జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఆయనతోపాటు విజయసాయి కూడా జైలుకు వెళ్లారు. ఆడిటర్గా లెక్కలన్నీ తారుమారు చేశారని ఆయన్ను అరెస్టు చేశారు. తనతోపాటు కష్టాలు అనుభవించిన విజయసాయిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు జగన్. విజయసాయిరెడ్డికి పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వం అప్పగించారు.
జగన్ నీడలా విజయసాయి రెడ్డి..! అన్ని ఆయన కనుసన్నల్లోనే..!!
ఇప్పుడు విజయసాయిరెడ్డి వైసీపీలో నంబరు టూగా కొనసాగుతున్నారనే చెప్పాలి. జాతీయ స్థాయిలో ఏ వ్యవహరమైనా సరే విజయసాయినే చక్కదిద్దుతుంటారు. అలాగే ఇప్పుడు పార్టీ వ్యవహారాలు కూడా ఆయనే చూసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. జగన్ మంత్రి వర్గ విస్తరణ సమయంలోనూ విజయసాయితో చర్చించే ఎంపిక చేశారు. అలాగే కొత్త మంత్రులు ప్రమాణస్వీకారానికి విజయసాయి ఫోన్ చేసి ఆహ్వానించారంటే ఆయనకే జగన్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకువచ్చు. ఇప్పుడు జగన్కు ఆత్మగా విజయసాయిరెడ్డి మారిపోయారనే చర్చ జరుగుతోంది.