బీజేపీకి చంద్రబాబుకు మధ్య చిచ్చు: జగన్ విఫలమైన చోట కెవిపి...
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విఫలమైన చోట కాంగ్రెస రాజ్యసభ సభ్యుడు, వైఎస్ ఆత్మబంధువు కెవిపి రామచందర్ రావు విజయం సాధించినట్లు కనిపిస్తున్నారు. బిజెపికి, తెలుగుదేశం పార్టీకి మధ్య చిచ్చు పెట్టడానికి వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం ఉంటూ వచ్చింది. అందుకే, ప్రత్యేక హోదా అంశంపై జగన్ చంద్రబాబుపై వాగ్బాణాలు సంధిస్తూ వచ్చారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు కేంద్ర మంత్రి వర్గం నుంచి తన మంత్రులను ఉపసంహరించుకోవాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే, కేంద్రంతో సంబంధాలను చెడగొట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులే విమర్శిస్తూ వచ్చారు. అయితే, కెవిపి రామచందర్ రావు ప్రత్యేక హోదా బిల్లు ఇప్పుడు రెండు పార్టీలకు మధ్య చిచ్చు పెట్టినట్లే కనిపిస్తోంది.
బీజేపీకి షాక్: కేవీపీ హక్కుల నోటీసు, హాల్లో జైట్లీ రహస్యం చెప్పారని జైరాం
అనివార్యమైన స్థితిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కెవిపి బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పైగా, ప్రత్యేక హోదాపై చంద్రబాబు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. మంగళవారం రాజ్యసభలో జరిగిన పరిణామాలను చూస్తుంటే కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఒత్తిడి పెట్టాలనే అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
దానికితోడు, ప్రత్యేక హోదా అంశాన్ని ఆసరా చేసుకుని కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు బలపడుకుండా చూడాలనే ఎత్తుగడ కూడా చంద్రబాబుకు ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే, మంగళవారంనాడు రాజ్యసభలో తెలుగుదేశం సభ్యుడు సిఎం రమేష్ కెవిపి బిల్లుపై గట్టిగా మాట్లాడారు. సభలో సభ్యులున్నారని, ఆ బిల్లుపై ఓటింగ్ పెట్టాలని ఆయన కోరారు.
పైగా, కేంద్రంలో మంత్రిగా ఉన్న సుజనా చౌదరి కూడా కెవిపి రామచందర్ రావు బిల్లుకు అనుకూలంగా మాట్లాడారు. ప్రత్యేక హోదాపై బిజెపిని ఇది మరింత ఇరకాటంలో పెట్టింది. ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ తన వైఖరిని స్పష్టం చేయడం ద్వారా ప్రజల్లో సానుభూతి కోల్పోకుండా జాగ్రత్త పడిందని అనుకోవాలి. అదే సమయంలో బిజెపితో అభిప్రాయభేదాలు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ రకంగా జగన్ చేయలేని పనిని కెవిపి రామచందర్ రావు చేశారు.
Also Read: ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?
అదే సమయంలో విజయవాడలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై బిజెపి వైఖరిని తప్పు పడుుతూ మాట్లాడారు. రాష్ట్రం విడిపోవడానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా బీజేపీ కూడా కారణమని ఆయన అన్నారు. పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ కలిసి ఏపీని విభజించాయని, అందువల్ల ఇరు పార్టీలు కలిసి చర్చించుకుని ఏపీకి న్యాయం చేయాలని కోరారు.
ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకు చేయూతనివ్వాలన్నారు. విభజన చట్టంలోని అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కెవిపి బిల్లును సాకుగా తీసుకుని చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారని కూడా అనుకోవచ్చు. మొత్తం మీద, బిజెపికి, టిడిపికి మధ్య చిచ్చు రగులుకునే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి.