‘జల్లికట్టే’ స్ఫూర్తి, మనకా సత్తా లేదా?: చంద్రబాబుకు కేవీపీ ఘాటు లేఖ
తమిళ ప్రజలు నిర్వహించిన జల్లికట్టు ఆందోళనను ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు.
అమరావతి: తమిళ ప్రజలు నిర్వహించిన జల్లికట్టు ఆందోళనను ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఆయన శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఈ మేరకు ఓ లేఖ రాశారు.
ప్రత్యేక హోదా, వెనకబడిన ప్రాంతాలకు నిధులు, విశాఖ రైల్వే జోన్ తదితర అంశాలపై తమిళుల తరహా పోరాటం చేయాలని కేవీపీ పేర్కొన్నారు. ఈ పోరాటానికి చంద్రబాబు నాయకత్వం వహిస్తే మంచిదని అన్నారు.
చంద్రబాబు ముందుకొస్తే అన్ని రంగాలు, వర్గాలు ముందుకొస్తాయని చెప్పారు. సుప్రీంకోర్టే జల్లికట్టును వద్దని చెప్పినా.. తమిళులు పట్టుబట్టి మూడ్రోజుల్లో ఆర్డినెన్స్ తెప్పించుకున్నారని కేవీపీ గుర్తు చేశారు.
మనం రాష్ట్రం కోసం ఆ మాత్రం చేయలేమా? అని కేవీపీ నిలదీశారు. 9,10 షెడ్యూల్లోని ఆస్తుల విభజన కోసం పోరాడదామని అన్నారు. మనలో ఐకమత్యం లేదా చిత్తశుద్ధి లేదా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.