అమ్మో క్వారంటైన్.. ! ఏపీలో ఆస్పత్రుల పేరు చెబితే జనం బెంబేలు..
ఏపీలో తాజాగా కరోనా వైరస్ ప్రభావంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తొలుత విదేశీ ప్రయాణికుల కారణంగా పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి వల్ల మరింత పెరిగిపోయింది. నేరుగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులకు సైతం కరోనా సోకినట్లు తెలుస్తోంది. అయితే వీరిని స్వచ్ఛందంగా బయటికి వచ్చి చికిత్స తీసుకోవాలని పదేపదే కోరుతున్న ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాల్లో మాత్రం సరైన వసతులు కల్పించలేకపోతోంది. దీంతో కొత్తగా క్వారంటైన్ కేంద్రాలకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు.
క్వారంటైన్ కేంద్రాల్లో వసతుల కరవు..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అధికారికంగా నాలుగు ప్రభుత్వాసుపత్రులను కరోనా ప్రత్యేక కేంద్రాలుగా మార్చింది. కరోనా పాజిటివ్ గా తేలిన వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇక్కడికి రాక ముందే వీరిలో చాలా మందిని స్ధానికంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. కానీ అక్కడ వసతులు దారుణంగా ఉంటున్నాయి. పలుచోట్ల కనీసం తాగునీరు కూడా ఉండటం లేదు. మరికొన్ని చోట్ల సరైన మంచాలు కానీ భోజన వసతులు కానీ ఉండటం లేదు.
క్వారంటైన్ కు రాని బాధితులు..
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో స్ధానికంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తాజాగా బాధితుల రాక పెరుగుతోంది. అయితే అక్కడ కనీస వసతులు లేకపోవడంతో కరోనా ప్రబలే ప్రమాదం కూడా ఉందని భావిస్తున్న పలువురు బాధితులు.. క్వారంటైన్ కేంద్రాలకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కొందరు క్వారంటైన్ కోసం వచ్చినా వసతుల పరిస్ధితి చూసి వెనక్కి వెళ్లిపోయే పరిస్ధితులు ఉన్నాయి. దీంతో ఇప్పుడు క్వారంటైన్ పేరు చెబితేనే వారికి దడ పుడుతోంది.
రావాల్సిందేనంటున్న ప్రభుత్వం..
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీతో పాటు విదేశాలకు వెళ్లిన వారు కానీ, వారి బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఎవరైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రులకు రావాలని కోరుతున్నారు. ప్రధాన ఆస్పత్రుల్లో సదుపాయాలు తక్కువగా ఉండటంతో వారిని క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మరికొన్ని చోట్ల వారిని పలకరించేందుకు సైతం నిరాకరిస్తున్న పరిస్దితులు ఉన్నాయి. దీంతో బాధితులు కూడా అటు ఆస్పత్రులకు వెళ్లలేక, ఇటు క్వారంటైన్ కేంద్రాల్లో చేరలేక ఇంటివద్దే ఉండిపోతున్నారు.
Recommended Video
గుర్తించిన వారికి మాత్రమే క్వారంటైన్...
రాష్ట్రంలో కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్న బాధితుల్లో కొందరు క్వారైంటైన్ కు వెళ్లాలని ఉన్నా.. వసతులు లేకపోవడం, ఇతరత్రా కారణాలతో ఇంటివద్దే ఉండిపోతున్నారు. తాజాగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి సెల్ ఫోన్ నంబర్లు, పేర్ల డేటా బయిటికి రావడంతో అధికారులు వారిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. కానీ మిగిలిన వారు మాత్రం ఇంటివద్దనే ఉండిపోతున్నారు. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి వీరంతా క్వారంటైన్ కేంద్రాలకు వచ్చేలా చేయలేకపోతే ఎప్పటికీ కరోనా బాధితుల సంఖ్య పూర్తిగా అదుపులోకి రాదని నిపుణులు చెబుతున్నారు.