ఐఎఎస్ అధికారినంటూ మోసం చేసినకిలాడీ లేడీ అరెస్టు
హైదరాబాద్: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న కిలాడీ లేడీ శైలజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్, సనత్నగర్ పోలీస్స్టేషన్లలో శైలజపై పలు కేసులు నమోదయ్యాయి. నగరంలోని అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ, అలాగే ఇళ్లస్థలాలు ఇప్పిస్తామంటూ శైలజ మోసానికి పాల్పడింది.
తనను తాను ఐఏఎస్ అధికారిని అని చెప్పుకున్న ఆమె ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్, సనత్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో చాలా మంది వద్ద భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు చెప్పారు. దాదాపు వందమందికిపైగా బాధితులను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. శైలు అరెస్ట్ వార్త తెలుసుకున్న బాధితులు పోలీస్స్టేషన్ల వద్ద చేరుకుంటున్నారు.
అదలావుంటే, హైదరాబాద్ నగరంలో పోలీసులు జోరుగా కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్, సైదాబాద్లోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
సైదాబాద్, సింగరేణి కాలనీలో 350 మంది పోలీసులు ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేశారు. 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 130 మంది సిలిండర్లు, 15 గ్యాస్ రీఫిల్లింగ్ మిషన్లు, రెండు బైక్లు, 11 వేల గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అటు జూబ్లీహిల్స్ కార్మికనగర్లో 250 మంది పోలీసులు సోదాలు జరిపారు. 33 మంది అనుమానితులను, నకిలీ బంగారు నాణాలు అమ్మే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 280 వాహనాలు, రెండు ఆటోలు, 230 గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.