మెడిసిన్ పిజి విద్యార్థిని ఆత్మహత్యతో భగ్గుమన్నమెడికోలు...లైంగిక వేధింపులే ఉసురు తీశాయి!
తిరుపతి:మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన తిరుపతిలోని శ్రీ ఎస్వీఎంసీ పీడియాట్రిక్స్ పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప మరణం వైదద్య విద్యారంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
తొలుత పరీక్షలో తప్పడం వల్లే డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరగగా...ఆ తర్వాత ఆమె మరణంపై మెడికోలు ఆందోళనకు దిగడంతో అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. తమపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిందనే కోపంతో విభాగాధిపతులు కక్ష గట్టడమే ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణమైనట్లుగా తెలిసింది. డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు కారకులైనవారిపై చర్యలు తీసుకునేంతవరకు తమ పోరాటం ఆపేదిలేదంటూ మెడికోలు స్పష్టం చేస్తున్నారు.
డాక్టర్ శిల్ప ఆత్మహత్య...గతంలో ఫిర్యాదు
తిరుపతిలోని శ్రీ ఎస్వీఎంసీ పీడియాట్రిక్స్ పీజీ వైద్య విద్యార్థిని, లేడీ డాక్టర్ శిల్ప మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా పీలేరులో తాను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో ఆమె ఉరి వేసుకున్నారు. ఎస్వీఎంసీ చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, మరో ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ కిరీటి, డాక్టర్ శశికుమార్ లైంగికంగా వేధించారంటూ గతంలో కలెక్టర్ నుంచి గవర్నర్ వరకు శిల్ప ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ ఆదేశాల మేరకు కళాశాలలోనే ఓమారు అంతర్గత విచారణ జరిపారు. ఆ విచారణలో శిల్పకు మతిస్థిమితం సరిగ్గా లేదని నివేదిక అందజేశారు.
మరోసారి...ఫిర్యాదు
దీంతో లైంగిక వేధింపులపై ఆమె మరోసారి గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మొత్తం ముగ్గరు ప్రొఫెసర్లపై ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి ఆర్డీవో, చిత్తూరు మహిళా డీఎస్పీ, ‘తుడా' కార్యదర్శి, ఐసీడీఎస్ అధికారులు, డీఎంహెచ్వోలతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ శిల్ప ఆరోపణలపై మరోమారు విచారణ జరిపింది. విచారణల సందర్భంగా శిల్పకు అధ్యాపకుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, ఫైనల్ పరీక్షల్లో వారు తనను ఎక్కడ ఫెయిల్ చేస్తారోనని ఎప్పుడూ భయపడుతుండేదని శిల్ప భర్త, ఆర్థోపెడిక్ సర్జన్ రూపేశ్ కుమార్ రెడ్డి వాపోయారు. దీనివల్ల తీవ్ర మానసిక సంఘర్షణకు గురైన ఆమెకు మానసిక శాస్త్ర నిపుణుల వద్ద కౌన్సెలింగ్ కూడా ఇప్పించామని ఆయన తెలిపారు. అయితే, ఆమె భయపడినట్టే థియరీ విభాగంలో ఫెయిల్ అయ్యిందని తెలిపారు.
రీ-వెరిఫికేషన్...రిజల్ట్ లోనూ
అయితే అధ్యాపకులపై అనుమానంతో ఆ పేపర్లను రీ-వెరిఫికేషన్కు పంపామని, అందులో కూడా ఆమె ఫెయిల్ అయినట్లు తమకు సోమవారం సాయంత్రం తెలిసిందని శిల్ప భర్త రూపేశ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో తాను ఆస్పత్రి నుంచి అర్థరాత్రి ఇంటికెళ్లి చూసేలోపు శిల్ప ఉరివేసుకుని చనిపోయినట్టు ఆయన తెలిపారు. దీంతో భర్త రూపేష్, శిల్ప బంధువు ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు శిల్ప తల్లిదండ్రులు తమ కుమార్తె ఆత్మహత్యకు వేధింపుల పర్వమే కారణమైనట్లు ఆరోపించారు.
భగ్గుమన్న మెడికోలు...ముట్టడి
డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు నిరసనగా ఎస్వీఎంసీలో మెడికోలు ఆందోళన కు దిగారు. ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని ముట్టడించారు. న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేదిలేదని...అంతవరకు ఐదు రోజుల పాటు తరగతులను బహిష్కరిస్తున్నట్టు వారు స్పష్టం చేశారు. శిల్ప ఆత్మహత్య, తదనంతరం వైద్య విద్యార్థుల ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. శిల్ప ఆత్మహత్యకు కారకుడిగా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్ను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సస్పెండ్ చేసింది. పూర్తి స్థాయి విచారణకు హైపవర్ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ డీఎంఈ బాబ్జీ ఆధ్వర్యంలో బుధవారం ఎస్వీఎంఎసీకి రానుంది. కాగా, శిల్ప కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్టు డీజీపీ ఠాకూర్ ప్రకటించారు. ఈమేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది.
నివేదిక ఆలస్యం...నా కూతుర్ని చంపేసింది
డాక్టర్ శిల్ప తల్లిదండ్రులు రాజగోపాల్, గీత మాట్లాడుతూ...‘‘ప్రొఫెసర్లపై కలెక్టర్ నియమించిన కమిటీ నివేదికను బయటపెట్టడంలో జరిగిన ఆలస్యమే మా కూతుర్ని చంపేసింది. మంచో, చెడో నివేదికలో ఏముందో బయటపెట్టి ఉంటే శిల్ప అంతో ఇంతో సంతృప్తి పడేది. ఉజ్వలమైన భవిష్యత్తును ఫణంగా పెట్టి పోరాడినా ఫలితం లేకపోయిందని దిగులు పడేది. అయినా మా కూతురు పోరాడింది తన కోసం కాదు. తన తోటి వారి కోసం. డాక్టర్లను దేవుళ్లుగా కొలిచే సంప్రదాయం మనది. మెడికల్ కాలేజీలో ఉన్నది డాక్టర్లు కాదు, రాక్షసులు. వారిని కఠినంగా శిక్షించాలి. శిల్పను హింసించి, ఆమె చావడానికి కారణమైన వారందరినీ జైల్లో పెట్టాలి. మా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకో బిడ్డకు జరక్కూడదు''...అని మనోవేదన వ్యక్తం చేశారు.