హత్యా? ఆత్మహత్యా?: విజయవాడలో కలకలం.. మహిళా డాక్టర్ మృతిపై అనుమానాలు..
భర్తే హత్య చేసి ఉంటాడని కూడా కొంతమంది కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండటం గమనార్హం. బంధువుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సుష్మా భర్త సునీల్ ను అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ: పటమట అశోక్ నగర్ కాలనీకి చెందిన సుష్మా అనే ఓ డాక్టర్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకుని మూడు రోజులు కావస్తున్నా.. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. భర్త సునీల్ వేధింపులు భరించలేకే సుష్మా ఆత్మహత్య చేసుకుందని, అతన్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
భర్తే హత్య చేసి ఉంటాడని కూడా కొంతమంది కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండటం గమనార్హం. బంధువుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సుష్మా భర్త సునీల్ ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టమ్ రిపోర్టు తర్వాత దీనిపై స్పందిస్తామన్నారు. కాగా, సుష్మా-సునీల్ లకు ఏడేళ్ల పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
సుష్మా కుటుంబ సభ్యుల తరుపున ఓ న్యాయవాది మాట్లాడుతూ.. సుష్మాది కచ్చితంగా హత్యేనన్నారు. ప్రాథమిక ఆధారాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయని చెప్పారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మృతురాలు సుష్మా తల్లి గీత కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెప్పింది.