మహిళా ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో బూతు, బెదిరింపు పోస్టింగులు...పోలీసులకు ఫిర్యాదు
కృష్ణా జిల్లా:సాక్షాత్తూ మహిళా ఎమ్మెల్యేపైనే సోషల్ మీడియా లో బూతు, బెదిరింపులు పోస్టులు పెడుతున్న యువకుడి ఉదంతమిది. తన ప్రతిష్టని దారుణ:గా దెబ్బతీసేలా వరుస పోస్టింగ్ లు చేస్తున్న ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సదరు మహిళా ఎమ్మెల్యే...వివరాల్లోకి వెళితే...
తనపై తప్పుడు కథనాలు పోస్టు చేయడంతో పాటు మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు గురి చేసే పోస్టులు పెడుతున్నవ్యక్తిపై పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొరిపర్తి నాగబాబు అనే వైసిపి కార్యకర్త ఇలా తనపై పోస్టులు పెడుతున్నట్లు ఆధారాలతో సహా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కృష్ణా జిల్లా పామర్రు పరిధిలోని యాదవపురానికి చెందిన గొరిపర్తి నాగబాబు అనే వైసిపి కార్యకర్త పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను ఉద్దేశించి ఆగస్టు 21వ తేదీన సోషల్ మీడియాలో తొలిసారిగా "నీవు చీరలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తావని తెలియక రాజు అన్న నీకు సహాయం చేసినట్టు"...అనే అభ్యంతరకరమైన పోస్టు పెట్టాడని తెలిసింది. అయితే ఆ పోస్టుపై ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన స్పందించలేదని తెలిసింది.
దీంతో మరింత రెచ్చిపోయిన అతడు "ఆడ ఊసరవెల్లి ఇక్కడ రంగు మార్చింది, పార్టీలు మారింది"; "ప్లాష్ న్యూస్... తప్ప తాగి దొరికిపోయిన ఫోటోతో చిక్కిన మహిళా ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే పామర్రు వచ్చేయండి", మళ్లీ సెప్టెంబరు 23న "మన పామర్రులో మావోయిస్టులు లేరు కదా అవినీతి ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండండి మీ మేలు కోరి చెబుతున్నాం అంతే, అరకు ఘనటతో పామర్రు ఫిరాయింపు ఎమ్మెల్యే ముఖ చిత్రం మారిందట, అరకు దాకా వచ్చిన మీరు అమరావతికి రాకపోవడమేంటి అన్నలూ... ఈట్ ఈజ్ వెరీ దారుణం, ఓపాలొచ్చి పొవచ్చుగదా" అనే పోస్టులు పెట్టాడట.
ఇంతటితో ఆగని ఇతడు ఎమ్మెల్యేను మరింత భయబ్రాంతులకు గురి చేసేందుకు మరో వ్యక్తితో కలిసి ఏకంగా ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు నాగబాబు మీద 500, 116 ఐపిసి 3(1 ఆర్) 3(2)(విఎ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నాగబాబును విచారణ నిమిత్తం స్టేషన్కు తీసుకువచ్చినట్లు, నిందితుడిని గుడివాడ డిఎస్పీ పి.మహేష్ విచారణ చేయనున్నారని ఎస్ఐ పి.రాంబాబు మీడియాకు తెలిపారు.