ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దౌర్జన్యం...పోలీసుల సమక్షంలోనే!:సబ్ కలెక్టర్ కు మహిళ ఫిర్యాదు
విశాఖపట్నం:పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ తన స్థలాన్ని ఆక్రమించేందుకుగాను తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే బంధువు,మహిళా ఎంపిటిసిని గిడ్డి విజయలక్ష్మి సోమవారం పాడేరు సబ్ కలెక్టర్ డి.కె.బాలాజీ దృష్టికి ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే తరచూ అర్ధరాత్రులు మనుషులను తమ నివాసంపైకి పంపుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చింతలవీధి ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. తాజాగా ఆదివారం అర్ధరాత్రి ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి మా ఇంటిపై రాళ్లు రువ్వారని, మా స్థలం ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేయడానికి పూనుకున్నారని ఆమె వాపోయారు.
ఈ స్థల వివాదంపై గ్రామస్తుల సమక్షంలో విచారణ జరిపి తమ హక్కులో ఉన్న భూమిని తమకు అప్పగించాలని ఎంపిటిసిని గిడ్డి విజయలక్ష్మి సబ్ కలెక్టర్ను కోరారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ భూ వివాదంపై విచారణ జరుపుతామని, ఆ సమయంలో స్థల సంక్రమణకు సంబంధించిన వీలునామా, పట్టా రికార్డులను ఎంపిటిసి గిడ్డి విజయలక్ష్మికి సూచించారు.
అనంతరం ఇదే విషయమై ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పాడేరు సీఐ,ఎస్ఐ సమక్షంలోనే ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఆదివారం రాత్రి తమపై దౌర్జన్యానికి దిగారని చెప్పారు. రెండు జేసీబీలు, లారీలు తెచ్చి రోడ్డు వేయడానికి చిప్స్, ఇతర సామగ్రిని అక్కడవేసి, రోడ్డు వేయడం కోసం నాలుగు గంటలసేపు అక్కడే పనులు చేయించారని ఆమె వివరించారు.
దీంతో తాము ఆందోళనతో ఆ రాత్రి వేళే ఎమ్మెల్యే దౌర్జన్యంపై పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చామని, దీంతో అక్కడకు పోలీసు అధికారులు వచ్చారని, అయినా ఎమ్మెల్యే వారెవరినీ లెక్క చేయకుండా తన అనుచరులను కూలీలకు సపోర్టుగా ఉంచి దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణానికి ఉపక్రమించారని ఆమె తెలిపారు. ఈ స్థలం వివాదంపై ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోందని, అయినా ఎమ్మెల్యే ఇలా దౌర్జన్యంగా మా హక్కులో ఉన్న పట్టా భూమిని ఆక్రమించాలని చూడటం దారుణమని గిడ్డి విజయలక్ష్మి వాపోయారు.
ఇలా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ తమపై దౌర్జన్యం, దాడులు జరపడం ఇది నాలుగోసారని చెప్పారు. స్థల వివాదం కోర్టులో ఉన్నందున ఇరువర్గాలు ఎటువంటి పనులు చేయవద్దని తహసీల్దార్ చెప్పారని, అయినా ఎమ్మెల్యే రోడ్డుకోసం తమ స్థలం ఆక్రమిస్తుండడం అన్యాయమని...అధికారులు వెంటనే స్పందించి నిలువరించాలని ఆమె కోరారు. ఎమ్మెల్యే దౌర్జన్యంపై మంగళవారం ఏఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్టు ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి తెలిపారు.