ముందు ఆమె న్యూడ్ ఫొటో పంపింది...తర్వాత అబ్బాయి నగ్న చిత్రం అడిగింది:ఆపైన బ్లాక్ మెయిల్ మొదలెట్టింది.
విజయవాడ:సోషల్ మీడియా పరిచయాలను అడ్డుకొని సైబర్ క్రైమ్స్ కు పాల్పడుతున్నవారి ఉదంతాలు ఇటీవలి కాలంలో కోకొల్లలుగా వెలుగుచూస్తున్నాయి. అయితే ఇటువంటి ఘటనల్లో సాధారణంగా పురుషులే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుండటం కద్దు.
కానీ ఇందుకు భిన్నంగా జరిగిన ఒక ఘటన, దానికి సంబంధించి నమోదైన ఫిర్యాదు పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. పైగా ఈ ఘటన తెలుగు నాట, అదీ రాజధాని జిల్లా గుంటూరులో చోటుచేసుకోవడం విశేషం. ముందుగా మాయమాటలతో, తన అశ్లీల చేష్టలతో ఓ నర్సరావుపేట యువకుడిని ముగ్గులోకి దించిన మహిళ ఆ తర్వాత ఆ యువకుడు పంపిన ఒక ఫోటో అడ్డు పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ కి దిగింది. దీంతో ఈ వ్యవహారం పోలీసులకు చేరింది. వివరాల్లోకి వెళితే...
పోలీసుల కథనం ప్రకారం...గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన 23 ఏళ్ల యువకుడు బ్యాటరీల పనిచేస్తుంటాడు. ఇతడికి ఇటీవలే ఫేస్బుక్ ద్వారా ఒక మహిళ పరిచయం అయింది. ఆ క్రమంలో వీరి పరిచయం పెరిగి ఇద్దరూ తరచుగా ఛాటింగ్ చేసుకుంటూ ఉండేవారు. తనది గుంటూరు అని, తాను ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నానని చెప్పిన ఆ యువతి తనకు వివాహమైందని, భర్త హైదరాబాద్లో పనిచేస్తాడని, ఒక పాప కూడా ఉందని చెప్పుకొచ్చింది.
ఆ తరువాత వీరి మధ్య ఛాటింగ్ మరింత పెరిగిన క్రమంలో ఇటీవల ఆమె తన నగ్నచిత్రం అంటూ ఒక ఫొటోను ఫేస్బుక్ ద్వారా ఆ యువకుడికి పంపింది. ఆ తర్వాత నువ్వు కూడా అలాగే నీ నగ్నచిత్రం నాకు పంపించమని అడిగింది. దీంతో ఆ యువకుడు ఆమె కోరిన విధంగానే తన న్యూడ్ ఫోటో ఆమెకు పంపించాడు. ఆ మరుసటి రోజే ఆ మహిళ తనకు అర్జంటుగా డబ్బు అవసరం అయిందని, ఆ డబ్బు సర్ధమని అడిగింది.
అతడు తన వద్ద డబ్బు లేదనడంతో నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ ఫొటోను అన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తానని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. ఆ బెదిరింపులు కొనసాగుతుండగానే ఈ యువకుడు పని మీద విజయవాడ అశోక్నగర్లోని తన అక్క, బావ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఆ యువతి డబ్బుల కోసం మరోసారి ఫోన్ చేసి బెదిరించింది. ఆ క్రమంలో యువకుడి వాలకం గమనించి యువకుడి సోదరి,బావ విషయం తెలుసుకున్నారు.
ఆ తర్వాత ఈ విషయమై విజయవాడ పటమట పోలీసులను ఆశ్రయించారు. బాధిత యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో తమ వ్యక్తిగత విషయాలు,ఫొటోలు పెట్టి ఇబ్బందుల్లో పడొద్దని, సోషల్ మీడియా వినియోగించేప్పుడు అప్రమప్తంగా వ్యవహరించాలని పటమట సీఐ ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.