కిరణ్ రిపోర్ట్ 'కీ'లకం: గంటా, లగడపాటి సంచలన వ్యాఖ్య
రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగే అవకాశం లేదన్నారు. ఈ నెల 27 లేదా 28న రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. రాజీనామాలు ఆమోదించుకుని ఉద్యమంలో పాల్గొంటానని లగడపాటి చెప్పారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజీనామా చేస్తే యూపిఏకు మనుగడ ఉండదని హెచ్చరించారు. రాష్ట్రపతి దగ్గరే తెలంగాణ బిల్లు ఆగిపోయే అవకాశముందన్నారు.
కిరణ్ ముందే చెప్పారు: కొండ్రు
విభజన జరిగితే జరిగే నష్టాలను ముఖ్యమంత్రి ముందే అధిష్టానానికి చెప్పారని మంత్రి కొండ్రు మురళి అన్నారు. జివోఎంకు కిరణ్ వాస్తవ నివేదిక అందించారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. విభజనను అడ్డుకునేందుకు కిరణ్ శతవిధాల ప్రయత్నిస్తున్నారన్నారు. విభజన అనివార్యమైతే భద్రాచలం సీమాంధ్రలో కలపాలని కేంద్రాన్ని కోరతామని కొండ్రు తెలిపారు. విభజన జరగదనే నమ్మకంతో ఉన్నామన్నారు. కొండ్రు తిరుపతిలో మాట్లాడారు.
బిల్లు అసెంబ్లీకి వస్తే సత్తా తెలుస్తుంది: శైలజానాథ్
విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని మరో మంత్రి శైలజానాథ్ అన్నారు. సమైక్యం కోసం ఏ అవకాశాన్ని వదులుకోమన్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కాంగ్రెసు పైన విమర్శలు మానుకొని సమైక్యం కోసం కృషి చేయాలని అనంతపురం జిల్లాలో అన్నారు.
కిరణ్ నివేదిక కీలకం: గంటా
విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నివేదిక కీలకమైందని గంటా శ్రీనివాస రావు వేరుగా చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెసు పార్టీ అధిష్టానంలో మార్పు వస్తుందన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకే రాదన్నారు. విభజన జరగదని గంటా ధీమా వ్యక్తం చేశారు.