లగడపాటి జోస్యం తెలంగాణలో అట్టర్ ఫ్లాఫ్..! ఏపిలో కొడతారా క్లాప్..? తేడా వస్తే 'జగడ'పాటే..!!
అమరావతి/హైదరాబాద్ : లగడపాటి రాజగోపాల్ ఎగ్సిట్ పోల్స్ కి వేళయింది. మరి కొద్ది సేపట్లో ఆయన ఎగ్సిట్ పోల్స్ బయటకు రాబోతున్నాయి. ఇవి ఎంతవరకు నిజమవుతాయనేది పక్కన పెడితే.. అధికశాతం బెట్టింగ్రాయుళ్లకు మాత్రం ఆంధ్ర ఆక్టోపస్ సర్వే కామధేనువు వంటిదనే చెప్పాలి. ప్రస్తుతం ఏపీలో బెట్టింగ్లు తారాస్థాయికి చేరాయి. మంగళగిరి కేంద్రంగా కోట్లాదిరూపాయలు చేతులు మారతుతున్నాయి. కృష్ణమ్మ సాక్షిగా సాగుతున్న పందేలను ఆపేందుకు పోలీసు వ్యవస్థ కూడా దృష్టిసారించకపోవటం ఆందోళన కలిగిస్తున్న అంశం.
ఆశలు రేపుతున్న లగడపాటి సర్వే..! పెరుగుతున్న బెట్టింగులు..!!
ఇప్పటి వరకూ జరిగిన పందేల్లో ప్రథమస్థానంలో ఉన్నది చంద్రబాబు, జగన్ ఇద్దరూ సాధించబోయే మెజార్టీపై కావటం విశేషం. ఆ తరువాత లోకేష్, పరిటాల శ్రీరామ్, దేవినేని అవినాష్, దేవినేని ఉమా మహేశ్వరరావు వంటి అభ్యర్థుల తరువాత స్థానాల్లో ఉన్నారు. వాస్తవానికి 2019 సాధారణ ఎన్నికలు.. చాలా అసాధారణంగా జరిగాయి. 2014లో జగన్ బలం పుంజుకున్నా టీడీపీ, జనసేన కలయికతో కాపులు, ఎస్సీలు, బీసీలు బాబు వైపు మొగ్గుచూపారు.
ప్రాముఖ్యత కోల్పోయిన లగడపాటి..! ఐనా నమ్ముతున్న పందె రాయుళ్లు..!!
దీని ఫలితంగా వైసీపీ కోలుకోలేని దెబ్బతినాల్సి వచ్చింది. 67 సీట్లు గెలిచినా. ఓటమికి కారణం కేవలం 2శాతం ఓట్లే కావటం జగన్ను మరింత ఆవేదనకు గురిచేసేందుకు కారణమైంది. దీనికి పవన్ చీల్చిన ఓట్లే కారణమనే వ్యతిరేకత కూడా వచ్చింది. ఈ సారి పవన్ తాను ఒంటరిగా బరిలోకి దిగటం.. బీఎస్పీతో పొత్తను చివరి నిమిషంలో ప్రకటించటం ఇవన్నీ చంద్రబాబు ఎత్తుగడలో భాగమేనంటూ వైసీపీ ప్రచారం చేసుకుంది. దీంతో జగన్ వైపు సానుభూతి పవనాలు వీచాయని.. వాటివల్లనే ఫ్యాన్ గాలి పెరిగిందంటూ జబ్బలు చరచుకుంటున్నాయి వైసీపీ శ్రేణులు.
రాజకీయ నేతల్లో ఆసక్తి..! రాజగోపాల్ జోస్యంతో ఊరటపొందాలనుకుంటున్న నేతలు..!!
ఎవరికివారు అంచనాలు వేసుకుంటూ గెలుపు ధీమాలో ఉన్నా.. పందేల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19 లగడపాటి సర్వే ప్రకటిస్తానని చెప్పినా.. అవి ముందుగా ప్రకటించే అవకాశాలు ఉండడంతో మళ్లీ బెట్టింగ్లు మొదలయ్యాయి. అయితే.. 2018లో తెలంగాణ ముందస్తు ఎన్నికలపుడు లగడపాటి తన సర్వేలో కూటమి గెలుస్తుందని ప్రకటించాడు. చంద్రశేఖర్ రావు ఓడిపోతారంటూ నోరుజారారు. అయితే ఆ ఫలితం తారుమారు కావటంతో ఇప్పుడు కూడా అదే ఫలితం వస్తే.. తాము నష్టపోతామనే ఆందోళన కూడా బెట్టింగ్ రాయుళ్లలో నెలకొంది.
లగడపాటి ఎవరినకి అనుకూలం..! తేడా వస్తే 'జగడ'పాటే..!!
అయితే.. లగడపాటి నాలుగు దఫాలుగా సర్వే చేయించటం వల్లనే జాప్యం జరిగిందంటూ జనాల్లోకి నెమ్మదిగా విషయాన్ని ఎక్కించటంలో టీడీపీ శ్రేణులు విజయం సాధించాయి. దీంతో లగడపాటి సర్వే తరువాత పందేలు వందల కోట్లు సాగే అవకాశాలున్నాయంటూ ఇరుపార్టీల నుంచి పెద్దతలకాయలు రంగంలోకి దిగాయి. ఈ లెక్కన.. భూములు తనఖాపెట్టి మరీ పందెలు కాసేందుకు అభిమానులు, కార్యకర్తలు సిద్ధపడుతున్నారు. మరి ఇవన్నీ వారిని గట్టెక్కిస్తాయా! నట్టేట ముంచుతాయనేది చూడాలి.