అద్భుతం: బాబును కలిసిన లగడపాటి, అనుచరుల ఇళ్లకూ.. టిడిపి ఆ మచ్చ అంటించుకుంటుందా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో లగడపాటి ఏపీ సీఎంను కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తాత్కాలిక సచివాలయమే ఇంత అద్భుతంగా ఉంటే, శాశ్వత కట్టడం ఇంకెంత బాగుంటుందోనని ప్రశంసించారు. అయితే తమ భేటీ మర్యాదపూర్వకమేనని లగడపాటి చెప్పారు. కానీ చంద్రబాబును లగడపాటి కలడవంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.
చంద్రబాబు ఆ మచ్చ అంటించుకుంటారా?
లగడపాటి టిడిపిలో చేరుతారా అనే చర్చ సాగుతోంది. అంతేకాదు, ఆయన తన అనుచరుల ఇళ్లకు కూడా వెళ్లి కలిశారు. దీంతో ఆయన తిరిగి రాజకీయ ఆరంగేట్రం చేయవచ్చునని భావిస్తున్నారు.
ఒకవేళ టిడిపిలో చేరితే కనుక చంద్రబాబుకు లగడపాటి మచ్చ అంటుకుంటుందని అంటున్నారు. పార్లమెంటులో ఏపీ రీఆర్గనైజేషన్కు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టినప్పుడు లగడపాటి పెప్పర్ స్ప్రే చల్లారు. టిడిపిలోకి వస్తే.. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో టిడిపిని నిలదీసేందుకు ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు.