బాబుతో నేనే మాట్లాడాలా?: సుజనా, రమేష్లకు లగడపాటి ఫోన్
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని తొలగించడం సరికాదని మాజీ పార్లమెంటుసభ్యుడు లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. అంతేగాక, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్లకు ఫోన్ చేసి వైయస్ విగ్రహం కూల్చివేతపై మాట్లాడారు.
'మీరైనా ముఖ్యమంత్రికి చెప్పండి. లేదంటే.. నేరుగా వచ్చిన నేనే మాట్లాడుతా'నని వారితో చెప్పినట్లు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. విజయవాడలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత వైయస్ విగ్రహాన్ని ఏకపక్షంగా తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు.
వైయస్ విగ్రహం తొలగిస్తున్న విషయం తెలిసిన వెంటనే తాను తెలుగుదేశం నాయకులతో మాట్లాడినట్లు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. కాగా, అప్పట్లో వైయస్ చేపట్టిన జలయజ్ఞానికి ప్రశంసపూర్వకంగా 2009లో బెజవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
కృష్ణా నది పుష్కరాల అభివృద్ది పనుల నిమిత్తం 40 హిందూ దేవాలయాలను కూల్చివేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా విగ్రహాలపై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అర్థరాత్రి కంట్రోల్ రూంకు దగ్గరలో ఉన్న దివంగత సీఎం వైయస్ విగ్రహాన్ని అధికారులు తొలగించి వేశారు.
వైయస్ విగ్రహం పునఃప్రతిష్టించండి: పార్థసారథి
విజయవాడ నగరంలో వైయస్ఆర్ విగ్రహా తొలగింపుపై ఆదివారం వైఎస్ఆర్సీపీ ప్రతినిథుల బృందం కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బాబును కలిశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. తొలగించిన చోటే వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే తామే విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్టస్తామని తేల్చిచెప్పారు.