టి: మళ్లీ లగడపాటి రిజైన్, జగన్కు లక్ష్మీపార్వతి కితాబు
న్యూఢిల్లీ: విజయవాడ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత లగడపాటి రాజగోపాల్ మరోసారి రాజీనామా చేశారు. సోమవారం లోకసభ సెక్రటరీ జనరల్కు ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదని, స్వచ్ఛందంగా రాజీనామా లేఖను ఇస్తున్నానని చెప్పారు.
తన రాజీనామాను స్పీకర్ మీరా కుమార్ ఆమోదిస్తారని భావిస్తున్నానన్నారు. తాను మంగళవారం సభాపతిని కలిసి రాజీనామా ఆమోదానికి ఒత్తిడి తీసుకు వస్తానని చెప్పారు. రాజీనామా ఆమోదించుకునేందుకు తాను తనవంతు ప్రయత్నాలు చేస్తానన్నారు. మరోవైపు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తన రాజీనామా లేఖను పిఏ ద్వారా పంపించారు.
జగన్కు లక్ష్మీపార్వతి కితాబు
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు సమైక్యంపై చాలా చిత్తశుద్దితో ఉందని లక్ష్మీ పార్వతి వేరుగా అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఆమె సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానని, సమైక్యమే వినిపిస్తానన్నాు. సమైక్యవాదానికి కృషి చేస్తున్న వారికి మద్దతు ఇవ్వాలన్నారు.
కట్టుబడి ఉంటా: పనబాక
విభజనపై తాను కాంగ్రెసు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. సీమాంధ్రకు న్యాయం చేస్తామని చెప్పినందుకే తాము అంగీకరించామన్నారు. కాంగ్రెసు న్యాయం చేస్తుందనే నమ్మకముందన్నారు. పార్టీ సిధ్దాంతాన్ని నమ్మి ఆ పార్టీలో కొనసాగుతున్నామని అలాంటప్పుడు నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. అయితే తమ ప్రాంత ప్రయోజనాలను తాము విస్మరించమన్నారు.