యుపిలో బిజెపి హవా ఎందువల్ల..: లగడపాటి రాజగోపాల్ సర్వే ఏమంటోంది...
మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఎన్నికలపై తనదైన శైలిలో సర్వేలు చేయించి, ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించడం అలవాటుగా మారింది. యుపి, పంజాబ్ ఎన్నికల్లో రాబోయే ఫలితాలపై ఆయన ఇలా....
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తనదైన శైలిలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని వెల్లడిస్తూ వస్తున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలా ఉండడానికి కారణాలేమిటో ఆయన వివరించారు.
ఉత్తరప్రదేశ్లో బిజెపి అత్యధిక స్థానాలు పొంది అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, మ్యాజిక్ ఫిగర్ 202కి కొంచెం అటూ ఇటూగా బిజెపికి సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. ఎన్నికల సర్వేల్లో ఎప్పుడూ ఖచ్చితమైన అంకెలు చెప్పే లగడపాటి ఫ్లాష్ టీం ఉత్తరప్రదేశ్, పంజాబు రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది.
యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కలిసినా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణాలు అనేకం ఉన్నాయని లగడపాటి తెలిపారు.
ఆయనకు మంచి పేరున్నా....
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్కు అవినీతి రహితుడిగా మంచి పేరున్నా సమాజ్వాదీపార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి 100కి పైగా సీట్లివ్వడం వల్ల కూడా ఎస్పీ పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడిందని ఆయన చెప్పారు. ఎస్పీసిట్టింగ్ అభ్యర్థుల్లో చాలామందిపై క్రిమినల్ కేసులున్నాయని, ప్రజలు వారిపట్ల చాలా సందర్భాల్లో వ్యతిరేకత తెలిపినా అఖిలేశ్ పట్టించుకోలేదని చెప్పారు. ఎస్పీని తన చేతుల్లోకి తీసుకున్న అఖిలేశ్ను యువత హీరోగా అభివర్ణిస్తోందని చెప్పారు. ఎస్పీ తరపున పోటీ చేసిన 225 మందిలో 120 మంది ఓడిపోయే అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు.
నరేంద్ర మోడీ హవానే...
ఉత్తరప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీ విస్తృత ప్రచారమే బిజెపిని గెలిపిస్తోందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. తొలి దశల్లో కొంత డీలా పడ్డా మూడో దశ పోలింగ్ నుంచి ఆ పార్టీ ప్రచారం పుంజుకుందని చెప్పారు. హిందూ ఓట్ల ఏకీకరణకు మోడీ ప్రసంగాలు బాగా పని చేశాయన్నారు. రంజాన్ రోజున విద్యుత్ను నిరంతరాయంగా ఇచ్చే అఖిలేశ్ దీపావళి రోజు ఇవ్వడం లేదని, ముస్లింలకు కబరస్తాన్ కోసం స్థలాలను కేటాయించిన ఎస్పీ ప్రభుత్వం హిందువులను విస్మరించిందని మోడీ చేసిన ప్రచారం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.
రుణమాఫీ ప్రభావం చూపింది..
రాయితీలకు ఎప్పుడూ దూరంగా ఉండే ప్రధాని మోడీ అందరికన్నా ముందుగా సన్నకారు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడం బిజెపికి లాభించినట్లు లగడపాటి తెలిపారు. రైతు రుణ మాఫీ వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుందని భావించిన సన్నకారు రైతులంతా బీజేపీకి ఓటేశారన్నారు. ఎస్పీ ఈ నినాదాన్ని చాలా ఆలస్యంగా తెరపైకి తీసుకొచ్చిందని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తమ ఫ్లాష్టీం సర్వేలో తేలిందని చెప్పారు. కాంగ్రెస్కు 30-35 స్థానాలు మాత్రమే వస్తాయన్నారు.
పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెసు
పంజాబ్లో ఈసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తమ ప్లాష్టీం సర్వేలో తేలిందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు తెలిపారు. అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన గాలులు వీస్తున్నాయని ఆయన అన్నారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రె్సకు అత్యధిక స్థానాలు వస్తాయని, ఆప్ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందని అన్నారు. కాంగ్రె్సకు 70 వరకూ వచ్చే అవకాశాలున్నాయని, క్రికెటర్ సిద్దూ చేరడం ఆ పార్టీకి కలిసొచ్చిన అంశాల్లో ఒకటని చెప్పారు. బీజేపీ 4-5 సీట్లకే పరిమితమవుతుందని తెలిపారు.