ఏపీ రిజల్ట్స్ పై హింట్ ఇచ్చిన లగడపాటి ! ఊపిరి పీల్చుకుంటున్న టీడీపీ ? మే 19న పూర్తి వివరాలు
ఆంధ్ర ఆక్టోపస్ మరోసారి నోరు విప్పారు. ఏపి ఎన్నికల ఫలితాల పైన చెప్పకనే చెప్పేసారు. తెలంగాణ ఎన్నికల పైన తన జ్యోస్యం ఎందుకు విఫలమైందో కూడా చెబుతానంటున్నారు. అయితే, ఆయన వ్యాఖ్యల ద్వారా ఓ విషయంలో స్పష్టత వచ్చింది. లగడపాటి అంచనాలే టిడిపి ధీమాకు కారణంగా తెలుస్తోంది. ఇంతకీ లగడపాటి ఏం చెప్పారంటే..
సంక్షేమం..అభివృద్దికే పట్టం..
ఏపిలో ఎన్నికల ఫలితాల పైన లగడపాటి రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. అమెరికాలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న లగడపాటి సర్వే వివరాలను మే 19న చెబుతానని స్పష్టం చేసారు. అదే సమయంలో ఏపి ప్రజలు సంక్షేమం..అభివృద్దికి పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం తిరుమలలో సైతం లగడపాటి ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. అప్పుడు కూడా అధికార పార్టీకే అనుకూలంగా ఆయన చెబుతున్నారనే వాదన మొదలైంది. ఇక, పోలింగ్ ముగిసన సమయం నుండి అనేక మంది టిడిపి నేతలు తమ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళి.. విజయావకాశాలు ఉన్నాయో తెలుసుకొనే ప్రయత్నం చేసారు. అయితే, తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత లగడపాటి సర్వేలకు అంతగా ప్రాధాన్యత లేదనే వాదన ఉంది. ఈ పరిస్థితుల్లో తాజాగా లగడపాటి చేసిన ఈ వ్యాఖ్యలతో మరో సారి రాజకీయంగా చర్చ మొదలైంది.
టిడిపి ధీమా కు కారణంగా లగడపాటేనా..!
పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఉదయానికి..సాయంత్రానికి టిడిపి వ్యూహాల్లో మార్పు కనిపించింది. ఉదయం ఇవియంల నిర్వహణ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసహనంతో కనిపించిన టిడిపి అధినాయకత్వం మధ్నాహ్నం సమయానికి వ్యూహం మార్చింది. ప్రజలంతా పోలింగ్ బూత్లకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకించి మహిళలు పోలింగ్ బూత్లకు వచ్చేలా ప్రయత్నాలు చేసారు. ఇక, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనటం ద్వారా తమకు మేలు జరుగుతుందని టిడిపి నేతలు అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో లగడపాటి సైతం పోస్ట్ పోల్ సర్వేల ఫలితాలపై టిడిపి ముఖ్యులు ఆరా తీయగా..టిడిపికి అనుకూలంగా ఉన్నాయని చెప్పాయని..ఆయనతో పాటుగా మరి కొన్ని సర్వే సంస్థలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసాయని చెబుతున్నారు. వారి లెక్కల ఆధారంగా టిడిపి నేతలు తాము తిరిగి అధికారంలోకి రావటం ఖాయమనే ధీమాలో ఉన్నారు.
లగడపాటి లెక్కలు నిజమవుతాయా..
తెలంగాణ ఎన్నికల సమయంలో లగడపాటి పోలింగ్ ముందే తిరుమల వేదికగా తన అభిప్రాయాలు చెప్పటం మొదలు పెట్టారు. స్వతంత్ర అభ్యర్దులు ఎక్కువగా గెలుస్తారని చెబుతూనే..పరోక్షంగా కాంగ్రెస్ -టిడిపి కూటమి గెలుస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఇక, పోలింగ్ కు రెండు రోజుల ముందు కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్టు ఇవ్వటం టిఆర్యస్ చేసిన తప్పు అంటూ విశ్లేషించారు. అయితే, తెలంగాణ ఎన్నికల ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. దీని పైన ఇప్పటి వరకు సమాధానం ఇవ్వని లగడపాటి.. తాజాగా అమెరికాలో జరగుతున్న ఎన్నారైల సదస్సులో సైతం దీనికి కారణం మే 19న ఎగ్జిట్ పోల్స్తో పాటుగా వివరిస్తానని స్పష్టం చేసారు.