తెలంగాణ: ఇంకా రాజకీయాలొద్దని లగడపాటి, 'పెప్పర్ స్ప్రే కేసు...'
విజయవాడ: రాష్ట్ర విభజన తీరుతో తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యానని, ఇప్పట్లో తాను రాజకీయాల్లోకి పునరాగమనం చేసే ఆలోచన ఏదీ లేదని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శనివారం నాడు స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని లగడపాటి విభజనకు ముందు చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కావడంతో ఆయన రాజకీయాల నుంచి వైదొలిగారు. ఆయన తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తున్నారనే ఊహాగానాలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి.
దీనిపై ఆయన శనివారం నాడు స్పందించారు. తాను తీసుకున్న నిర్ణయంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులేదని, ఇప్పుడు రాజకీయంగా తనకు ఎలాంటి ఆలోచన లేదన్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
పాత పరిచయాలున్న సన్నిహితుల పిలుపు మేరకు మాత్రమే కొన్ని కార్యక్రమాలకు వెళ్తున్నానని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు.
అంతకు ముందు చింతలపాడులో జరిగిన ఒక ప్రయివేటు కార్యక్రమంలో ఎమ్మెల్యే రక్షణనిధితో పిచ్చాపాటిగా మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలతో బాగానే మమేకమయ్యారుగా.. అంటూ బాగా పని చేస్తున్నారంటూ కితాబిచ్చారు. అనంతరం ఆయన నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును పరామర్శించారు.
పెప్పర్ స్ప్రే కేసు వివరాలు తెలియదు
తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా లోకసభలో పెప్పర్ స్ప్రే వాడకంపై కేసు నమోదైందా... విషయమై సమాచారం లేదని కేంద్ర ప్రజా సమాచార అధికారి తెలిపారు. ఈ ఘటనపై తీసుకున్న చర్యలు వెల్లడించాలని శ్రవణ్ కుమార్ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగారు. కాగా, నాడు విభజన బిల్లు పెడుతున్న సమయంలో లగడపాటి పెప్పర్ స్ప్రే చల్లిన విషయం తెలిసిందే.