చేతులు కాల్చుకోవడమే?, వైసీపీ మీద తగ్గిన బెట్టింగ్స్: అంతా లగడపాటి సర్వే ఎఫెక్ట్!
నంద్యాల ఉపఎన్నిక ఫలితంపై కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయి. లగడపాటి సర్వే టీడీపీకి అనుకూలంగా రావడంతో వైసీపీ మీద బెట్టింగ్స్ తగ్గాయి.
కర్నూలు: నంద్యాల ఉపఎన్నిక ఫలితంపై కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయి. సొంత విశ్లేషణలు, అంచనాలతో టీడీపీ-వైసీపీల మీద బెట్టింగ్ రాయుళ్లు జోరుగా బెట్టింగులు పెడుతున్నారు. నిన్నటిదాకా రెండు పార్టీల నుంచి జోరుగా బెట్టింగులు జరగ్గా.. లగడపాటి టీమ్ ఆర్జీఎస్ సర్వేతో ఒక వర్గం డైలామాలో పడ్డట్లు చెబుతున్నారు.
ఆర్టీఎస్ ఫ్లాష్ టీమ్ సర్వే టీడీపీకే విజయాన్ని కట్టబెట్టడంతో.. వైసీపీ మద్దతుదారులు ఆ పార్టీపై బెట్టింగ్ చేయడానికి వెనుకాడుతున్నారట. వైసీపీ మీద బెట్టింగ్స్ అంటే చేతులు కాల్చుకోవడమే అన్న అభిప్రాయంతో వారు వెనక్కి తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు టీడీపీ మద్దతుదారుల్లో మరింత జోష్ పెరిగి బెట్టింగులు జోరందుకున్నట్లు చెబుతున్నారు.
నంద్యాలలో టీడీపీకి భారీ మెజారిటీ ఖాయమన్న సంకేతాలను ఆర్టీఎస్ ఫ్లాష్ సర్వే ఇవ్వడంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇదే ఎఫెక్ట్ బెట్టింగుల మీద కూడా పడటంతో వైసీపీ మద్దతుదారులు వెనక్కి తగ్గుతున్నారు.
కాగా, లగడపాటి ఆర్జీఎస్ ఫ్లాష్ పోస్ట్ పోల్ సర్వేలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 54-56.78 శాతం ఓట్లు, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి 36-38.53 శాతం ఓట్లు పడతాయని తేలిన సంగతి తెలిసిందే. అంతకుముందు నిర్వహించిన ప్రీ పోల్ సర్వే కన్నా టీడీపీ బలపడటంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రీ పోల్ సర్వేలో టీడీపీకి 50.19 శాతం, వైసీపీకి 37.42 ఓట్లు వస్తాయని తేలింది. మొత్తం మీద సర్వేలన్ని టీడీపీకే అనుకూలంగా ఉండటంతో వైసీపీలో కలవరం మొదలైందంటున్నారు.