లగడపాటి రాజగోపాల్ ఆర్జీ ఫ్లాష్ సర్వే: నగరిలో మళ్లీ రోజాదే గెలుపు
అమరావతి: ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే నగరి నియోజవకవర్గంలో మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా గెలుస్తారట. ఈ మేరకు ఆంధ్రజ్యోతి కోసం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తరఫున సర్వేలు నిర్వహించే ఆర్జీఫ్లాష్ టీం సర్వే నిర్వహించింది. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నగరిని సర్వే కోసం ఎంచుకున్నారు.
నగరిలో వైసీపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరిలో స్వల్ప మెజారిటీతోనైనా వైసీపీ గెలుస్తుందని సర్వే తేల్చింది. 2014 ఎన్నికల ఫలితాలకు, తమ సర్వేలో వచ్చిన ఫలితానికి పెద్దగా తేడా లేదని వెల్లడించింది.
కాగా, 2014 ఎన్నికల్లో రోజా చేతిలో ఓడిపోయిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గతేడాది మరణించారు. ఆయన మరణంతో నగరిలో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందని కూడా ప్రజలు భావిస్తున్నారని సర్వే పేర్కొంది.