ఆంధ్రావాళ్లు ఏం చేయలేదు, సింగపూర్ కంటే..: కేసీఆర్
హైదరాబాద్: చాలామంది ఆంధ్రా పారిశ్రామికవేత్తలు భూములు తీసుకొని ఎలాంటి పనులు చేపట్టలేదని, అవి నిరుపయోగంగా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. హైదరాబాదులోని గ్రాండ్ కాకతీయ హోటల్లో పారిశ్రామికవేత్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు.
కొత్త పారిశ్రామిక విధానంతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. సింగపూర్ తరహాలో సింగిల్ విండో విధానం పరిశ్రమల ఏర్పాటుకు ప్రవేశ పెడతామన్నారు. ఒక్క సంతకంతో పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం బాగుండటమే తనకు కావాలన్నారు. పరిశ్రమలతో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుందన్నారు. మూడేళ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందన్నారు.
పరిశ్రమల అనుమతికి సీఎంవోలో ప్రత్యేక సెల్ అన్నారు. హైదరాబాదుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు శంషాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా సీఎం ఆఫీసుకు తీసుకువస్తామన్నారు. సింగపూర్ కంటే మెరుగైన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామన్నారు. 21 రోజుల్లో పరిశ్రమలకు అవసరమైన అనుమతులన్నింటినీ ఇస్తామన్నారు. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాదుకు రావాలని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి అందరూ తోడ్పడాలన్నారు. పొల్యుషన్ కంట్రోల్ వంటి ఒకటి రెండు అనుమతులు మినహా మిగిలిన వాటినన్నింటినీ ఒక్కచోటే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి అంశాన్నీ తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైనంత భూమి తెలంగాణలో అందుబాటులో ఉందన్నారు. అవినీతిరహిత రాష్ట్రంగా తెలంగాణను నిర్మిస్తామన్నారు. సింగరేణిని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి బాగా లేదన్నారు. చత్తీస్ గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు చేస్తామన్నారు. పారిశ్రామిక విధానంతో బలపడతామన్నారు. ఒకటి రెండు సంవత్సరాలు కఠినంగా ఉంటామని చెప్పారు. హైదరాబాదులో హార్డ్వేర్ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాదులో రెండున్నర కోట్ల మంది ఉండేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీ సెక్టారుకు పూర్తి భద్రత ఇస్తామని చెప్పారు.
హైదరాబాదును రెగ్యులేట్ చేయాల్సిన అవసరముందన్నారు. దళిత, గిరిజన, మహిళలు పారిశ్రామిక రంగంలోకి రావాల్సి ఉందన్నారు. చాలామంది ఆంధ్రా పారిశ్రామికవేత్తలు చాలా భూములు తీసుకొని ఎలాంటి పనులు చేపట్టలేదన్నారు. ఆ భూములు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. కాగా, కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో వివిధ పరిశ్రమలకు ఇచ్చి.. నిరుపయోగంగా ఉన్న భూములను తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అవకాశముంది. అందులో సినీ రంగ పరిశ్రమ కూడా ఉందంటున్నారు.