ఇదీ పరిస్థితి: ఓట్ల పండగ కోసం తరలిన జనం: కిటకిటలాడిన బస్సులు
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ కోసం ప్రజలు సిద్ధమయ్యారు. వివిధ నగరాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్వస్థలం బాట పట్టారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు పోలింగ్ కు ముందు రోజు రాత్రి స్వస్థలానికి బయలు దేరి వెళ్లారు. రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు..ఇలా అందుబాటులో ఉన్న అన్ని వనరులను వారు వినియోగించుకున్నారు.
తొలిదశలో అదృష్టం పరీక్షించుకుంటున్న అగ్రనేతలు వీరే
తెలంగాణలో సుమారు 14 లక్షల మంది సీమాంద్ర ఓటర్లు ఉన్నట్లు అంచనా. బుధవారం రాత్రి ఒక్క హైదరాబాద్ నుంచే సుమారు అయిదు లక్షల మందికి పైగా సీమాంధ్రులు తమ స్వస్థలాలకు బయలు దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. బెంగళూరులో చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, అనంతపురం కర్నూలు జిల్లాల ఓటర్లు వేలాది మంది ఓట్ల పండగలో పాలుపంచుకోవడానికి తమ స్వస్థలాలకు తరలి వెళ్లారు. దీనితో బస్సులు, రైళ్లు కిటకితలాడిపోయాయి. బస్సుల టాపుపై కూర్చుని ప్రమాదకరంగా తమ ప్రయాణాన్ని సాగించారు.
ప్రైవేటు బస్సుల్లో రెట్టింపు చార్జీలను వసూలు చేశారు. బెంగళూరు నుంచి హిందూపురం, అనంతపురం, కదిరి, గోరంట్ల, మదనపల్లి, తిరుపతి, పలమనేరు, పుంగనూరు, రాయచోటి, పుట్టపర్తి, మంత్రాలయం, తాడిపత్రి వంటి ప్రాంతాలకు రోజువారి కంటే అధిక చార్జీలను వసూలు చేశారు. ఆర్టీసీ కూడా ఈ విషయంలో తక్కువేమీ తినలేదు. సాధారణ చార్జీల కంటే 50 శాతం అదనపు మొత్తాన్ని ప్రయాణీకుల నుంచి వసూలు చేసింది.