లక్ష్మీనారాయణ పార్టీ పేరు ఇదే : తోడుగా నిలిచేదెవరు..!!
ఏపిలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఈ పార్టీని స్థాపిస్తున్నారు. ఏపి లో సరి కొత్త రాజకీయం చేస్తామంటున్న జెడి తన పార్టీకి పేరు ఇప్పటికే ఖరారు చేసారు. పార్టీ జెండా..అజెండా కు తుది రూపు ఇస్తున్నారు. ఈ నెల 26న తన పార్టీ పేరుతో పాటుగా విధి విధానాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
అదే సమయం లో మాజీ జెడి లక్ష్మీనారాయణ పార్టీలో క్రియా శీలకంగా ఎవరు వ్యవహరిస్తారనే దాని పై చర్చ మొదలైంది. ప్రస్తుతానికి లక్ష్మీనారాయణ తో కలిసి రాజకీయంగా అడుగులు వేయటానికి ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసిన జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్సలర్ రాజగోపాల్ పేరు వినిపిస్తోంది. కొత్త పార్టీకి ఆయన కో కన్వీనర్ గా వ్యవహరించనున్నారు.
ఏపికి కాబోయే సీయం ఎవరు: ఆ రెండు జిల్లాలే డిసైడ్ చేస్తాయా..!
తమ పార్టీ కొత్త తరహా రాజకీయాలను ప్రజల్లోకి తీసుకొస్తుందని లక్ష్మీనారాయణ సన్నిహితులు చెబుతున్నారు. ఈ నెల 26న ప్రకటించే పార్టీ పేరును ఇప్పటికే దాదాపు ఖరారు చేసారు. పార్టీ పేరు వందేమాతరం గా ప్రకటించాలని నిర్ణయించా రు. సాంకేతికంగా ఏమైనా ఈ పేరు మీద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటే జనధ్వని పేరును పరిశీలిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
లక్ష్మీనారాయణ పొత్తు ఆయనతోనేనా..రాజకీయ లక్ష్యం ఎవరు..ఎవరి ఓట్లకు గండి..!!
ఇక, పార్టీ జెండాలోనూ దేశభక్తి..రైతులు..మహిళలు..యువతకు ప్రాధాన్యత ఇస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ పార్టీ విధి విధానాలు సైతం పూర్తిగా అభివృద్ది - సంక్షేమం ప్రాతి పదికన ఉంటాయని మాజీ జెడి సన్నిహితులు చెబుతున్నారు. అయితే, లక్ష్మీనారాయణ ప్రకటించనున్న ఈ కొత్త పార్టీలో చేరికలు ఏ రకంగా ఉంటాయో...ఆయన ప్రకటించే విధానాలు ఎవరిని ఆకర్షిస్తాయనే దాని పై ఆసక్తి నెలకొంది.
ఇతర పార్టీల్లో రాజకీయంగా అవకాశం లేని వారు సైతం ఈ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది. మరి..సిబిఐ అధికారిగా ఏపి ప్రజల్లో గుర్తింపు పొందిన లక్ష్మీనారాయణ...రాజకీయ నేతగా ఎలా రాణిస్తారో చూడాలి.