జనసేనలో చేరుతున్నట్టు చెప్పలేదే: సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ
తిరుపతి: జనసేన పార్టీలో తాను చేరుతున్నట్టుగా మీడియాలో వస్తున్న వార్తలపై సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ స్పందించారు. తాను ఏనాడూ కూడ జనసేన పార్టీలో చేరుతున్నట్టుగా చెప్పలేదన్నారు. మీడియాలోనే ఈ రకంగా రాస్తున్నారని ఆయన చెప్పారు. విఆర్ఎస్ ఆమోదం పొందిన తర్వాత తన రాజకీయ భవిష్యత్ను ప్రకటించనున్నట్టు లక్ష్మీనారాయణ ప్రకటించారు.
సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ శనివారం నాడు తిరుమల వెంకటేశ్వరస్వామి సందర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మహరాష్ట్రలో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. అయితే విఆర్ఎస్ కోరుతూ మహరాష్ట్ర ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ ఇటీవల ధరఖాస్తు చేసుకొన్నారు.
అయితే ఈ విషయమై ఇంకా మహరాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. లక్ష్మీనారాయణ విఆర్ఎస్పై మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఈ విషయాన్ని మాజీ జెడి లక్ష్మీనారాయణ ప్రకటించారు.
తాను చేస్తున్న కొన్ని పనులకు మహరాష్ట్రలో విధులు నిర్వహించడం కొంత ఇబ్బందిగా ఉందన్నారు.దీంతోనే విఆర్ఎస్ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. అయితే విఆర్ఎస్ ఆమోదం పొందిన తర్వాత తన భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు ఆయన తెలిపారు.
తాను జనసేనలో చేరుతున్నట్టుగా మీడియాలో వార్తలను మీరే రాస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులనుద్దేశించి వ్యాఖ్యానించారు. తాను ఏనాడూ కూడ ఈ విషయాన్ని చెప్పలేదన్నారు. విఆర్ఎస్ ఆమోదం పొందిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు లక్ష్మీనారాయణ ప్రకటించారు.