పెద్దన్నను కోల్పోయా, అండగా..: గాలి మృతిపై లక్ష్మీపార్వతి కంటతడి, ప్రముఖుల నివాళి
హైదరాబాద్: తనకెంతో అండగా నిలిచిన ఓ సోదరుడిని కోల్పోయానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. డెంగ్యూ జ్వరంతో కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూసిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడికి ఆమె నివాళులర్పించారు.
Recommended Video
కలచివేసింది, తీరనిలోటు: గాలి మృతిపై బాబు దిగ్భ్రాంతి, షాకయ్యానని హరికృష్ణ
గాలి ముద్దకృష్ణమ కుటుంబసభ్యులను ఓదారుస్తూ ఆమె కూడా కన్నీళ్లపర్యంతమయ్యారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు గాలి ముద్దుకృష్ణమ నాయుడు తన ఉద్యోగాన్ని కూడా వదులుకుని రాజకీయాల్లోకి వచ్చేశారని చెప్పారు.
పెద్దన్నలాంటి వారు
గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఎన్టీఆర్కు అండగా నిలిచిన వ్యక్తని, తనకు పెద్దన్న వంటివారని లక్ష్మీపార్వతి అన్నారు. రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన పార్టీ మారారని, సిద్ధాంతాలు కలిగిన వ్యక్తని ఆమె చెప్పారు.
ఎన్టీఆర్ అంటే అభిమానం
తాను పాతపట్నం ఎమ్మెల్యేగా నిలబడితే తనను గెలిపించడానికి గాలి చాలా కృషి చేశారని గుర్తు చేశారు. గాలి ముద్దుకృష్ణమనాయుడికి ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
నేతల పరామర్శ
కాగా, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడుకి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు నివాళులర్పించారు. ముద్దుకృష్ణమ మృతి సమాచారం తెలుసుకున్న నేతలు బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, టీడీపీ ఎమ్మల్సీ బుద్ధా వెంకన్న, తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు, నామా నాగేశ్వరరావు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, రేవంత్రెడ్డి, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, రామకృష్ణ, సినీనటుడు చలపతిరావు తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ముద్దుకృష్ణమనాయుడు మృతిపట్ల సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటించారు.
కార్యక్రమాలు రద్దు చేసుకున్న బాబు
గాలి మృతి నేపథ్యంలో బుధవారం తాను పాల్లొనే సమావేశాలు, పలు కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేసుకున్నారు. ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి తిరుపతికి హెలీ అంబులెన్స్ విమానంలో తరలించే ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పలు కార్యక్రమాలు రద్దు చేసుకుని ముద్దుకృష్ణమనాయుడి భౌతికకాయానికి నివాళులర్పించేందుకు తిరుపతికి వెళ్లే యోచనలో ఉన్నారు.