ఆ ఘనత చంద్రబాబుదే: కోడెల మరణం వెనుక: లక్ష్మీపార్వతి సంచలనం..!
వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పాలనలో ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. రాజధాని..పోలవరం ద్వారా చంద్రబాబు ఈ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అవినీతి, దోపిడికి పాల్పడిన బాబుకు జగన్ పాలనను విమర్శించే హక్కు లేదన్నారు. ట్విటర్లో మాత్రమే మాట్లాడే కొడుకు కన్న ఘనత చంద్రబాబుదే అని ఎద్దేవా చేసారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో చంద్రబాబు కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. కోడెల మృతదేహాన్ని పట్టుకొని శవ రాజకీయం చేశారని... చంద్రబాబు, కోడెల కుటుంబ సభ్యలు వల్లనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని దుయ్యబట్టారు. రాశారు. టీడీపీ పాలనలో ప్రజా ధనాన్ని జన్మభూమి కమిటీలు దోచుకుతిన్నాయని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు.
తల్లుల కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్ నాలుగు నెలల పాలనపై ఎటువంటి రీమార్క్ లేదని పేర్కొన్నారు.న తండ్రి బాటలోనే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అవినీతి రహిత పాలన చేస్తున్నారని ప్రశంసించారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యం వైపు ఆయన అడుగులు వేస్తున్నారని చెప్పుకొచ్చారు. నాలుగు నెలల పాలనలో సుమారు నాలుగున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత సీఎం జగన్ది అని ప్రశంసించారు. సీఎం జగన్ నిజాయతీ పాలన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. ఐదేళ్లలో కమిషన్ల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
వైసీపీలోనే ఉంటున్నా కొద్ది రోజులుగా లక్ష్మీపార్వతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తనకు కీలక పదవి అప్పగిస్తారని లక్ష్మీపార్వతి ఆశించారు. అయితే, ఇప్పటికే రోజా తో పాటుగా వాసిరెడ్డి పద్మకు సైతం పదవులు కట్టబెట్టారు. కానీ, జగన్ పార్టీ పెట్టిన సమయం నుండి ఆయనతోటే అనుసరిస్తున్న లక్ష్మీపార్వతి కి పదవి ఇవ్వకపోవటం పైన కొంత నిరాశకు గురైనట్లుగా ఆమెతో సన్నిహితంగా ఉండేవారు చెబుతున్న విషయం. కానీ, లక్ష్మీపార్వతి మాత్రం దీని పైన ఎక్కడా.. ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. పార్టీ నేతలు మాత్రం త్వరలోనే లక్ష్మీపార్వతి కి పదవి దక్కుతుందని చెబుతూ వస్తున్నారు. దీంతో..ఇప్పుడు లక్ష్మీపార్వతి జగన్ పాలనను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేసారు.