పిల్ల కాంగ్రెస్,పిల్ల బిజెపి,పిల్ల కమ్యూనిస్ట్...అన్నీ చంద్రబాబే:వైసిపి నేత లక్ష్మీ పార్వతి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ను మరోసారి మోసం చేస్తూ ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని వైసిపి ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆరోపించారు. కేవలం తన స్వార్థం కోసమే ఎపి సిఎం చంద్రబాబునాయుడు ఎన్నో తప్పటడుగులు వేస్తున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.
కాంగ్రెస్తో చంద్రబాబు ఎన్నో లోపాయికారి ఒప్పందాలున్నందున ఇప్పటినుంచి టిడిపిని పిల్ల కాంగ్రెస్ అని పిలవాలని ఆమె అన్నారు. అంతేకాదు పిల్ల కాంగ్రెస్, పిల్ల బీజేపీ, పిల్ల కమ్యూనిస్ట్ అన్నీ చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు కాంగ్రెస్తో ఎలా కలిసిపోయారో అందరూ చూశారన్నారు.
నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ప్రజల వ్యతిరేఖతతో చంద్రబాబు కూటమి నుంచి బయటకొచ్చారని పేర్కొన్నారు.ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు కాంగ్రెస్తో కలవడానికి ఏపీ సీఎం యత్నిస్తున్నారని, ఇన్ని అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదన్నారు లక్ష్మీ పార్వతి.
బెంగుళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీని చంద్రబాబు అభినందించిన తీరు చూస్తే పిల్ల కాంగ్రెస్ ఎవరో అందరికీ స్పష్టంగా అర్థమైందని లక్ష్మీపార్వతి వ్యంగాస్త్రాలు సంధించారు. గతంలో సోనియా గాంధీని ఇటలీ దెయ్యం అని స్వయంగా వ్యాఖ్యానించిన చంద్రబాబు...తన రాజకీయ స్వార్థం కోసం నేడు అదే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆరోపించారు.